కాళోజీ సెంటర్: జిల్లా విద్యాశాఖలో అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ (ఏపీఓ) పోస్టు ఏడాదిన్నర కాలంగా ఖాళీగా ఉండడంతో ఉద్యోగులపై పనిభారం పెరిగి ఒత్తిడికి లోనవుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. 2025వ సంవత్సరంలో విద్యాశాఖలో నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులను అక్రమ డిప్యూటేషన్లపై డీఈఓ కార్యాలయంలో వివిధ పోస్టుల్లో భర్తీ చేశారని కలెక్టర్ భావించారు. విద్యాశాఖ (అప్పటి డీఈఓ) వ్యవహార శైలిపై సమీక్షించి డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను తిరిగి వెనక్కి పంపాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. అందులో భాగంగా దీర్ఘకాలంగా ఏపీఓ స్థానంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుని కూడా 2025, ఫిబ్రవరిలో వెనక్కి పంపారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆ స్థానం భర్తీ చేయకుండా ఖాళీగానే ఉంటోంది. దాంతో సంబంధిత సెక్షన్ అధికారి చేయాల్సిన పని పెండింగ్ పడి వ్యవస్థ కుంటుపడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఎస్జీటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయులతో భర్తీ చేయాలి. కానీ, తొమ్మిది నెలల క్రితం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకుండానే ఒక స్కూల్ అసిస్టెంట్ను కలెక్టర్కు డీఈఓ ప్రతిపాదించి అనుమతి తీసుకున్నారు. అది నిబంధనలకు విరుద్ధమని విమర్శలు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడంతో ఇప్పటికి ఏపీఓ పోస్టు భర్తీకి నోచుకోవడం లేదు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి ఏపీఓ పోస్టు భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.
భర్తీ కాకపోవడంతో పనులు పెండింగ్


