● కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్: 2026–27 ఆర్థిక సంవత్సరానికి గ్రామ, మండల, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు (జీపీడీపీ, బీపీడీపీ, డీపీడీపీ) సమగ్రంగా రూపొందించి నిర్ణీత గడువులోగా సమర్పించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ ప్రణాళికల రూపకల్పనపై అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖలు 2026–27 కార్యాచరణ ప్రణాళికలు, అమలులో ఉన్న పథకాలు, ప్రతిపాదిత పనులు, అందుబాటులో ఉన్న వనరులు, లబ్ధిదారుల వివరాలు, నిధుల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సిద్ధం చేసి జీపీడీపీ ప్రణాళికల్లో పొందుపర్చాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ శాఖల వారీగా ఏర్పాట్లు సమీక్షించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, అదనపు కలెక్టర్ రవి, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఇజ్రాయిల్ పర్యటన
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు ఇజ్రాయిల్లో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ‘అర్బన్ వాటర్ సప్లై అండ్ డెవలప్మెంట్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈకార్యక్రమానికి తెలంగాణ నుంచి హాజరవుతున్న ఇద్దరు ఐఏ ఎస్ అధికారుల్లో హనుమకొండ కలెక్టర్ ఒకరు. పట్టణ నీటి సరఫరా, ఆధునిక జల నిర్వహణ, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జరిగే సదస్సులు, సాంకేతిక ప్రదర్శనలు, అధ్యయన కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఇజ్రాయిల్లో అమలవుతున్న ఆధునిక నీటి నిర్వహణ విధానాలు, పట్టణ తాగునీటి సరఫరా వ్యవస్థలపై అవగాహన పెంపొందించుకుని, వాటిలో అనువైన విధానాలను తెలంగాణలో అమలు చేసే అవకాశాలను పరిశీలించనున్నారు. కాగా, ఇన్చార్జ్ కలెక్టర్గా అదనపు బాధ్యతలను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్.రవికి అప్పగించారు.


