శాయంపేట: ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ఉపాధ్యాయుడు సుమారు రెండు గంటలకుపైగా నరకయాతన అనుభవించాడు. మహేంద్ర సూపర్ ప్యాసింజర్ వాహనంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు 10 మంది హనుమకొండ నుంచి భూపాలపల్లి, కొత్తపల్లి, మహదేవపూర్ ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో హనుమకొండ నుంచి పరకాల వైపు వెళ్తున్న నూతన ట్రాక్టర్ మండలంలోని మాందారిపేట హెచ్పీ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే.. డ్రైవర్ ఒక్కసారిగా ట్రాక్టర్ను బంక్ పైపు తిప్పాడు. వెనకాలే వస్తున్న (టీఎస్ 03 యూడీ 0468) మహేంద్ర సూపర్ ప్యాసింజర్ వాహనం ట్రాక్టర్ను ఢీకొని పల్టీ కొట్టింది. అక్కడే ఉన్న స్థానికులు ట్రాక్టర్ సాయంతో మహేంద్ర సూపర్ వావానాన్ని పైకి లేపారు. వాహనంలో 10 మంది ఉపాధ్యాయులుండగా.. డ్రైవర్ వేణుకు తీవ్ర గాయాలలయ్యాయి. అతడిని ఆత్మకూరుకు చెందిన 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈఘటనలో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ పక్కనే కూర్చున్న ఉపాధ్యాయుడు రామ్మూర్తి కాలు వాహనంలో ఇర్కుపోయింది. మిగతా 9 మందికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు తక్కళ్ల సాంబయ్య, భాస్కర్ జేసీబీసీ సాయంతో ఎంతో శ్రమించి రామ్మూర్తిని బయటకు తీశారు. రామూర్తికి తొడ భాగం, కాలు రెండు చోట్ల విరిగిపోయాయి. రామ్మూర్తిని బయటకు తీసుకొచ్చిన స్థానికులు 108 అంబులెన్స్ అంబాటులో లేక సుమారు గంటకు పైగా రోడ్డు పక్కన పడుకోబెట్టారు. గంట తర్వాత 108 అంబులెన్స్ రావడంతో రామూర్తిని వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు.
108 అందుబాటులో లేక ఇబ్బంది
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న 108 అంబులెన్స్ సిబ్బంది లేకపోవడంతో హనుమకొండ నుంచి 108 వాహనం రావడంతో తీవ్ర ఆలస్యమైంది. ఈ సమయంలో ఉపాధ్యాయుడు నరకయాతన అనుభవించాడు.
రెండు వాహనాలు ఢీ..
కాలు ఇరుక్కుని టీచర్కు నరకం
జేసీబీతో కాపాడిన స్థానికులు
108 కోసం దాదాపు గంట పాటు
రోడ్డుపైనే క్షతగాత్రుడు


