దుగ్గొండి: ఎల్నినో ప్రభావంతో ఈసారి రాష్ట్ర వ్య వ్యాప్తంగా వర్షాలు కురవడం లేదు. ఫలితంగా అదును దాటిపోతుందని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. చుక్కనీరు కరువక పంటల సాగే ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి తరుణంలో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జీడికల్ గ్రామానికి చెందిన రైతులు డ్రిప్పు పద్ధతిలో పంటలు సాగు చేస్తుండగా నేడు పచ్చనిగా కళకళలాడుతున్నాయి. గ్రామ సరిహద్దుల్లో అడుగు పెడితే ఎటుచూసినా పచ్చని పంట పొలాలు దర్శనమిస్తున్నాయి.
ఆ ఊరి రూపురేఖలనే
మార్చిన బిందుసేద్యం
జీడికల్ గ్రామంలో 70 గృహాలు ఉండగా 100 మంది రైతులు ఉన్నారు. 300 ఎకరాల వ్యవసాయ సాగు భూములు ఉన్నాయి. ఇక్కడ 100 శాతం రైతులంతా డ్రిప్ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. పదిహేను ఏళ్ల క్రితం వర్షాభావ పరిస్థితులతో ఎండిపోయిన బావులు దర్శనమిచ్చేవి. కరువు కోరల్లో చిక్కుకుని రైతులు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన పరిస్థితి నుంచి నేడు కళకళలాడే ప్రకృతితో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. రైతుల పట్టుదల ఆధునిక సాంకేతికకు తోడైతే కరువును తరిమికొట్టవచ్చని నిరూపించింది జీడికల్ గ్రామం.
ఆదర్శం.. జీడికల్ గ్రామం
సామూహిక సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చని జీడికల్ రైతులు నిరూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరువు పీడిత ప్రాంతాలకు జీడికల్ దిక్సూచిగా నిలుస్తోంది. ఈ గ్రామాన్ని అధికారులు మోడల్ అగ్రివిలేజ్గా కొనియాడుతున్నారు.
ఏడారి నేలలో
హరిత విప్లవం..
కొన్ని సంవత్సరాల క్రితం జీడికల్ గ్రామం కరువుకు కేరాఫ్గా ఉండేది. ఇక్కడి బావుల్లో గంట,రెండు గంటలకు మించి నీరు రాదు. తక్కువ వర్షపాతం. అడుగంటిన భూగర్భ జలాలు. దీంతో సాగునీరు లేక రైతు తీవ్ర ఇబ్బందులు పడేవారు. సాంప్రదాయ పద్ధతులలో సాగు చేసి ఆర్థికంగా నష్టపోయారు. ఈ క్రమంలో నిరాశ నుంచి పుట్టిన ఓ ఆలోచన వారిని సరికొత్త బాటవైపు నడిపించింది. ఉన్న కొద్దిపాటి నీటిని వృథా చేయకుండా ప్రతీ నీటి చుక్కను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఊరంతా బిందు సేద్యం వైపు నడిచి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. నేడు పక్క గ్రామాలలో ఏ పంట లేక భూములు ఎడారులను తలపిస్తుండగా జీడికల్ గ్రామంలో మాత్రం 45 రోజుల వయస్సున్న పత్తి చేలు, మూడు నెలల వయసున్న అరటితోటలు, మొలకలెత్తిన పసుపు, ఆయిల్ పామ్తోటలు కళ కళలాడుతూ కనువిందు చేస్తున్నాయి. వర్షం వంక చూడకుండా వారి పనులు వారు చేసుకుంటున్నారు..
సిరులు కురిపిస్తున్న బిందు సేద్యం
కళకళలాడుతున్న పంటలు పొలాలు..
ఆదర్శంగా నిలుస్తున్న జీడికల్ రైతులు


