ధర్మసాగర్: తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల పంటలను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ధర్మసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా జరుగుతున్న నీటి పంపింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయినిగా మారిందని కొనియాడారు. ఈనెల రోజుల్లో ధర్మసాగర్, స్టేషన్ ఘన్పూర్, నవాబ్ పేట, అశ్వరావుపల్లి, చిటకోడూరు, బొమ్మకూరు రిజర్వాయర్లను నింపేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. రైతులు పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా రాబోయే 15 రోజుల్లో కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేస్తారని, దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని రైతులు ప్రభుత్వానికి, నీటి పారుదల శాఖ అధికారులకు రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సీఈ సుధీర్, ఎస్ఈ సీతారాం, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
గోదావరి జలాలకు పూజలు


