దుగ్గొండి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని భూసర్వే వరంగల్ జిల్లా ఏడీ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని మధిర గ్రామంలో భూముల రీసర్వేపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పురాతన కాలం నాటి సర్వే ఆధారంగానే నేడు రికార్డులు ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న రైతుల భూములను డిజిటల్ పద్ధతిలో సర్వే చేసి మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు. రైతులు తమ భూములు ఎవరికో పోతాయని భయపడాల్సిన అవసరం లేదన్నారు. సర్వే సమయంలో అడిగిన పత్రాలు చూపించి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముస్కు సమ్మక్క, సర్పంచ్ పరుపాటి పద్మ, ఉప సర్పంచ్ మడతలపాటి కుమార్, జీపీఓలు, ల్యాండ్ సర్వేయర్లు పాల్గొన్నారు.


