● రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు
● రైతుల మహాగర్జన సభ విజయవంతం కావాలని పూజలు
హన్మకొండ కల్చరల్: పాలకులు రైతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్లో ఓసీ జేఏసీ, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో లక్ష మందితో రైతుల మహా గర్జన సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలో సమాఖ్య రాష్ట్ర, ఉమ్మడి జిల్లాల నాయకులు పాల్గొని రైతుల మహాగర్జన సభ విజయవంతం కావాలని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, ప్రత్యేకపూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. అనంతరం పోలాడి రామారావు విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా అందరినీ మహా గర్జన సభకు ఆహ్వానిస్తున్నట్లు, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను మహాగర్జన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. పూజా కార్యక్రమంలో రాష్ట్ర వైశ్య సంఘాల జేఏసీ చైర్మన్ అయిత నాగరాజు, రైతు సంఘాల రాష్ట్ర జేఏసీ తోట సురేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహారెడ్డి, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.


