వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ఐనవోలు: రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా.. ఆరోగ్య శాఖ సూచనల మేరకు స్పెషలిస్టులతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే.. హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్యతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను స్పెషలిస్ట్ వైద్యులకు తెలిపి వైద్య సహాయం పొందాలని సూచించారు. ఐనవోలు పీహెచ్సీ పరిధిలో ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ–1164, షుగర్–264, క్యాన్సర్–23 మంది వైద్య సేవలు పొందుతున్నట్లు తెలిపారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరిస్తుందని తెలిపారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. ఆరుగురు ఎంజీఎం ఆస్పత్రి స్పెషలిస్టు వైద్యులతో శిబిరం ప్రారంభించామన్నారు. ఎస్హెచ్జీ మహిళలకు 30 రకాల రక్త పరీక్షలు చేసి హెల్త్కార్డులు ఇవ్వడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, స్పెషలిస్ట్ వైద్యులు, సరిత, నవీన్, మెడికల్ ఆఫీసర్ శ్యాం ప్రసాద్, ఎంపీడీఓ నర్మద, సర్పంచ్ గడ్డం రఘువంశీ, ఉప సర్పంచ్ భాస్కర్, వైద్య సిబ్బంది ఉన్నారు.


