● మార్కెట్ చైర్మన్లు శ్రీనివాస్, హరీశ్రెడ్డి
● నర్సంపేట నియోజకవర్గానికి
రూ.95 లక్షల యంత్ర పరికరాలు
నెక్కొండ: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలాయి శ్రీనివాస్, రావుల హరీశ్రెడ్డి అన్నారు. నెక్కొండ రైతు వేదిక ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయిలో ‘వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ’ (ఆత్మ)లో భాగంగా రైతులకు యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు రోటవేటర్లు, స్ప్రేయర్లు, వరిగడ్డి కట్టలు కట్టే యంత్రాలు, 11 చాళ్ల నాగళ్లు వంటి 86 వివిధ వ్యవసాయ పరికరాలు అందిస్తున్నట్లు వివరించారు. 86 మంది రైతులకు రూ.16.50 లక్షల విలువైన యంత్ర పరికరాలను అందించినట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో రూ.95 లక్షల విలువైన యంత్ర పరికరాల మంజూరుకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కృషి చేశారని కొనియాడారు. ఆత్మ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల మాట్లాడుతూ సబ్సిడీ ద్వారా పొందిన యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి, నెక్కొండ మేజర్ గ్రామ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, వివిధ మండలాల ఏఓలు, ఈఓలు, సర్పంచ్లు పాల్గొన్నారు.


