ఆ.. ముగ్గురే సూత్రధారులు | - | Sakshi
Sakshi News home page

ఆ.. ముగ్గురే సూత్రధారులు

Feb 28 2026 7:03 AM | Updated on Feb 28 2026 7:03 AM

ఆ.. మ

ఆ.. ముగ్గురే సూత్రధారులు

దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా సిబ్బంది కీలకపాత్ర

చార్జ్‌షీట్‌లో పేర్కొన్న సుబేదారి పోలీసులు

దందాను గతేడాది జూన్‌లోనే వెలుగులోకి తీసుకొచ్చిన సాక్షి

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ బాలరక్ష భవన్‌ కేంద్రంలో వెలుగుచూసిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’ లో అసలు సూత్రధారులు బాలరక్షాభవన్‌లోని ముగ్గురు సిబ్బందేనని వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు తేల్చారు. తక్కువ వయస్సున్న పిల్లలను దత్తత పొందడానికి ఎక్కువ వయస్సున్న దంపతులను తక్కువ వయస్సుగా చూపించడానికి నకిలీ డేట్‌ ఆఫ్‌ బర్త్‌, మెడికల్‌ సర్టిఫికెట్లు సమకూర్చడంలో సిబ్బంది బాల్నే సరిత, జక్కోజు కృష్ణ, మంద ప్రణయ్‌ పాత్ర కీలకమని గుర్తించారు. 2025, జూన్‌ 13న దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా కథనం ‘సాక్షి’లో ప్రచురితంకాగా, ఆ తర్వాత జిల్లా సంక్షేమ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో దత్తతకు దరఖాస్తు చేసుకున్న 9 మందిపైనే అదే నెలలో 25న సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారుల నివేదికతో పాటు పోలీసులు దత్తతకు దరఖాస్తు చేసుకున్నవారిని లోతుగా విచారిస్తే, వీరి నుంచి డబ్బులు తీసుకొని ఆయా సర్టిఫికెట్లు ఇప్పించింది బాలరక్షాభవన్‌లోని ముగ్గురేనని ఇటీవల పోలీసులు నమోదు చేసిన చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కేసు విచారణలో వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చిన అప్పటి పీఓ ఐసీ రాజు, మరో ముగ్గురి కాంట్రాక్ట్‌ను రెన్యువల్‌ చేయకుండా ఆ శాఖలోని కొందరు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దంపతుల ఎక్కువ వయస్సు కారణంగా తక్కువ వయస్సున్న పిల్లలు వచ్చే అవకాశం లేదని కొందరు అధికారులు ‘మామూలు’గా మాట్లాడి కొందరు ప్రైవేట్‌ పాఠశాలల యజమానులతో కుమ్మకై ్క సదరు సర్టిఫికెట్లను తీసుకొచ్చి వాటినే ఒరిజినల్‌ సర్టిఫికెట్లుగా చూపిస్తూ సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ (కారా) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారని అధికారుల విచారణలోనూ తేలింది.

అప్పుడలా..

పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న నర్సయ్య, రుక్మ, లస్మయ్య, చిన్న కేతమ్మ, మహిపాల్‌, సంధ్యారాణి, సుమతి, ప్రేమలత, అరుణ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారనే డీడబ్ల్యూఓ ఫిర్యాదు మేరకు 2025 జూన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అసలు వీరికి సలహాలు ఇవ్వడంతోపాటు నకిలీ సర్టిఫికెట్ల సమర్పణలో కీలకంగా వ్యవహరించిన బాలరక్షా భవన్‌లోని సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సదరు పిటిషన్‌లో కోరారు.

ఇప్పుడిలా..

పోలీసులు సమగ్ర విచారణ చేసి 27 మంది సాక్షులతో ఇటీవల కోర్టులో చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేశారు. ఏ1గా బాల్నే సరిత, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి (నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కేర్‌), ఏ2గా జక్కోజు కృష్ణ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఏ3 గా మంద ప్రణయ్‌, సోషల్‌ వర్కర్‌తో పాటు ఏ4గా నర్సంపేట అరుణోదయ విద్యాలయం ప్రిన్సి పాల్‌ గాండ్ల కొమరయ్య, ఏ5గా పర్వతగిరి శ్రీఅరుణోదయ విద్యాలయం నిర్వాహకుడు బోనాల సాంబయ్య, ఏ6గా ఏనుగల్లు శ్రీసాయి విద్యాలయానికి చెందిన గడ్డం వెంకటేశ్వర్లు, ఏ7గా నర్సంపేటలోని వివేకవర్ధిని ఎయిడెడ్‌ స్కూల్‌కు చెందిన మోతె తిరుపతిరెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు సిబ్బందిని పనితీరు బాగా లేకపోవడంతో కాంట్రాక్ట్‌ కాలాన్ని పునరుద్ధరించలేమంటూ జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి గతేడాది జూన్‌లోనే ఉత్తర్వులిచ్చారు. కేసు విచారణ సమయంలోనే వీరిని తప్పించడం చర్చనీయాంశమైంది.

ఆ.. ముగ్గురే సూత్రధారులు1
1/2

ఆ.. ముగ్గురే సూత్రధారులు

ఆ.. ముగ్గురే సూత్రధారులు2
2/2

ఆ.. ముగ్గురే సూత్రధారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement