ఆ.. ముగ్గురే సూత్రధారులు
న్యూస్రీల్
శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందాపై సుబేదారి పోలీసుల చార్జ్షీట్
సాక్షి, వరంగల్: వరంగల్ బాలరక్ష భవన్ కేంద్రంలో వెలుగుచూసిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’లో అసలు సూత్రధారులు బాలరక్షాభవన్లోని ముగ్గురు సిబ్బందేనని వరంగల్ కమిషనరేట్ పోలీసులు తేల్చారు. తక్కువ వయస్సున్న పిల్లలను దత్తత పొందడానికి ఎక్కువ వయస్సున్న దంపతులను తక్కువ వయస్సుగా చూపించడానికి నకిలీ డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ సర్టిఫికెట్లు సమకూర్చడంలో సిబ్బంది బాల్నే సరిత, జక్కోజు కృష్ణ, మంద ప్రణయ్ పాత్ర కీలకమని గుర్తించారు. 2025, జూన్ 13న సాక్షిలో దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా కథనం ప్రచురితమైతే, ఆ తర్వాత జిల్లా సంక్షేమ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో దత్తతకు దరఖాస్తు చేసుకున్న 9 మందిపైనే అదే నెలలో 25న సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారుల నివేదికతో పాటు పోలీసులు దత్తతకు దరఖాస్తు చేసుకున్నవారిని లోతుగా విచారిస్తే, వీరి నుంచి డబ్బులు తీసుకొని ఆయా సర్టిఫికెట్లు ఇప్పించింది బాలరక్షాభవన్లోని ముగ్గురేనని ఇటీవల పోలీసులు నమోదు చేసిన చార్జ్షీట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కేసు విచారణలో వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చిన అప్పటి పీఓ ఐసీ రాజు, మరో ముగ్గురి కాంట్రాక్ట్ను రెన్యువల్ చేయకుండా ఆ శాఖలోని కొందరు కలెక్టర్ డాక్టర్ సత్యశారదను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
అప్పుడలా..
పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న నర్సయ్య, రుక్మ, లస్మయ్య, చిన్న కేతమ్మ, మహిపాల్, సంధ్యారాణి, సుమతి, ప్రేమలత, అరుణ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారనే డీడబ్ల్యూఓ ఫిర్యాదు మేరకు 2025 జూన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అసలు వీరికి సలహాలు ఇవ్వడంతోపాటు నకిలీ సర్టిఫికెట్ల సమర్పణలో కీలకంగా వ్యవహరించిన బాలరక్షా భవన్లోని సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సదరు పిటిషన్లో కోరారు.
ఇప్పుడిలా..
పోలీసులు సమగ్ర విచారణ చేసి 27 మంది సాక్షులతో ఇటీవల కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేశారు. ఏ1గా బాల్నే సరిత, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్), ఏ2గా జక్కోజు కృష్ణ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఏ3 గా మంద ప్రణయ్, సోషల్ వర్కర్తో పాటు ఏ4గా నర్సంపేట అరుణోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ గాండ్ల కొమరయ్య, ఏ5గా పర్వతగిరి శ్రీఅరుణోదయ విద్యాలయం నిర్వాహకుడు బోనాల సాంబయ్య, ఏ6గా పర్వతగిరి మండలం ఏనుగల్లు శ్రీసాయి విద్యాలయానికి చెందిన గడ్డం వెంకటేశ్వర్లు, ఏ7గా నర్సంపేటలోని వివేకవర్ధిని ఎయిడెడ్ స్కూల్కు చెందిన మోతె తిరుపతిరెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు సిబ్బందిని పనితీరు బాగా లేకపోవడంతో కాంట్రాక్ట్ కాలాన్ని పునరుద్ధరించలేమంటూ జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి గతేడాది జూన్లోనే ఉత్తర్వులిచ్చారు. కేసు విచారణ సమయంలోనే వీరిని తప్పించడం చర్చనీయాంశమైంది.
నిబంధనలు ఎలా ‘క్యాష్’ చేసుకున్నారంటే..
వాస్తవానికి ఇద్దరు భార్యాభర్తల వయస్సు కలిపి 85 ఏళ్లుంటే రెండేళ్లలోపు పిల్లలు, 90 ఏళ్లుంటే రెండేళ్ల నుంచి నాలుగేళ్లలోపు, 100 ఏళ్లుంటే నాలుగు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లలు, 110 ఏళ్లుంటే ఎనిమిది నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు వస్తారు. ఇలా నకిలీ సర్టిఫికెట్ల దందాతో తక్కువ వయస్సున్న పిల్లలు అనర్హత కలిగిన దంపతులకు దత్తత వచ్చేలా చేస్తున్నారు.
అసలు దత్తత కోరే దంపతులు నిరక్షరాస్యులైతే వయస్సు ధ్రువీకరణ పత్రం ప్రభుత్వామోదిత వైద్యుడి వద్ద ఒసిఫికేషన్ పరీక్ష నివేదిక ఆధారంగా తీసుకోవచ్చు. లేకుంటే పాన్కార్డులో ఉన్న పుట్టిన తేదీ ఉంటే సరిపోతుంది. అయితే ఇవేమీ చెప్పకుండానే దంపతుల ఎక్కువ వయస్సు కారణంగా తక్కువ వయస్సున్న పిల్లలు వచ్చే అవకాశం లేదని కొందరు అధికారులు ‘మామూలు’గా మాట్లాడి కొందరు ప్రైవేట్ పాఠశాలల యజమానులతో కుమ్మకై ్క సదరు సర్టిఫికెట్లను తీసుకువచ్చి వాటినే ఒరిజినల్ సర్టిఫికెట్లుగా చూపిస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో అప్లోడ్ చేశారని అధికారుల విచారణలోనూ తేలింది. వరంగల్ జిల్లా కేంద్రంగా 2022లో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులిచ్చిన పత్రాల్లో ఈ నకిలీల బాగోతం బయటపడుతుండడం రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలోనే పెద్ద చర్చకు దారి తీస్తోంది.
గతేడాది జూన్లోనే వెలుగులోకి తీసుకొచ్చిన సాక్షి
ఆ తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు, నిందితులుగా తేల్చిన పోలీసులు
ఆ.. ముగ్గురే సూత్రధారులు
ఆ.. ముగ్గురే సూత్రధారులు
ఆ.. ముగ్గురే సూత్రధారులు
ఆ.. ముగ్గురే సూత్రధారులు
ఆ.. ముగ్గురే సూత్రధారులు


