సౌరవిద్యుత్ను సద్వినియోగం చేసుకోవాలి
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి
ఆత్మకూరు: సౌరవిద్యుత్ను సద్వినియోగం చేసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వరుణ్రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆత్మకూరు గ్రామం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై ందని తెలిపారు. ఇందులో భాగంగా 761 గృహ సముదాయాలకు 2కిలోవాట్స్, 468 వ్యవసాయ కనెక్షన్లకు 7.5 కిలోవాట్స్ చొప్పున టీజీ రెడ్కో సహకారంతో సుమారు రూ.48 కోట్లు 100 శాతం సబ్సిడీపై సోలార్ ప్యానల్స్ అందిస్తామని పేర్కొన్నారు. కొన్నిచోట్ల నూతన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్లైన్ల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని కోరారు. సోలార్ ప్యానల్స్తో పర్యావరణానికి ఎటువంటి హాని కలగదని, ఉత్పత్తి చేసిన విద్యుత్కు డబ్బులు చెల్లించనున్నట్లు వివరించారు. అవకాశాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సదస్సులో హనుమకొండ ఎస్ఈ మధుసూదన్, సీఎండీ ఆఫీస్ టెక్నికల్ డీఈ భాస్కరాచారి, హనుమకొండ రూరల్ డివిజనల్ ఇంజనీర్ మల్లికార్జున్, పరకాల అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ దేవేందర్, ఆత్మకూరు ఏఈ టి.వెంకటేశ్వర్లు, దామెర, పరకాల ఏఈలు రమేశ్, రాజు, సబ్ ఇంజనీర్లు చొక్కారావు, రాహుల్, విద్యుత్ సిబ్బంది దామోదర్, రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


