పారదర్శకంగా..వేగంగా..
● ధ్రువపత్రాల జారీలో
మధ్యవర్తుల జోక్యానికి చెక్
● ఇక నుంచి ఆన్లైన్లో
దరఖాస్తుల విచారణ
● త్వరలో అందుబాటులో పేపర్లెస్ సేవలు
సంగెం: రెవెన్యూశాఖలో పౌరసేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు కొ త్త వ్యవస్థను తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పౌరసేవల దరఖాస్తుల విచారణ కాగిత రహితం (పేపర్ లెస్)గా చేపట్టనుంది. ఆయా దరఖాస్తుల విచారణతో పా టు ఇచ్చే నివేదిక ప్రక్రియ మొత్తం ఇక ఆన్లైన్లో కొనసాగనుంది. ఇందుకోసం గ్రామ పాలనాధికారులకు కొత్తగా మొబైల్ యాప్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే పలు గ్రామాల్లో మొబైల్ యాప్ పనితీరును రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో ఈ యాప్ ఆచరణలో సాంకేతికంగా తలెత్తుతున్న అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకనుగుణంగా మార్పులు, చే ర్పులు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో అడ్డంకులన్నీ అధిగమించి పూర్తిస్థాయిలో రాష్ట్రంలో అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇలా..
మీసేవ కేంద్రాల్లో కులం, ఆదాయ తదితర సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసిన తర్వాత నిర్వాహకులు వి వరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. వివరాలన్నీ తహసీల్దార్ లాగిన్లోకి వెళ్తాయి. దరఖాస్తులను డౌ న్లోడ్ చేసుకుని, వాటి ఆధారంగా ఆర్ఐ, లేదా నా యబ్ తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సి బ్బందితో కలిసి విచారణ చేయాల్సి ఉంటుంది. కాని స్టేషనరీ కొరత కారణంతో రెవెన్యూ సిబ్బంది దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోకుండా మీ సేవ కేంద్రాల నిర్వాహకుల నుంచి దరఖాస్తులను తెప్పించుకుని విచారణ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆర్ఐ, నాయబ్ తహసీల్దార్ల సెక్షన్లకు దరఖాస్తులు వెళ్లే క్రమంలో కొన్ని దరఖాస్తులు దొరకకుండా మిస్సింగ్ అయిన సందర్భాలూ ఉన్నాయి.
కొత్త యాప్ వినియోగం ఇలా..
మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత చిరునామా ఆధారంగా ఆటోమేటిక్గా సంబంధిత జీపీఓల వ్యక్తిగత లాగిన్లోకి వెళ్తాయి. ఈ వివరాల ఆధారంగా సదరు జీపీఓ విచారణ పూర్తి చేసి ఆన్లైన్లో నివేదిక ఇస్తూ దరఖాస్తులను ఆర్ఐ లాగిన్ కు పంపిస్తారు. ఆర్ఐ కూడా ఇదేవిధంగా విచారణ చేసి నాయబ్ తహసీల్దార్ లాగిన్కు, అక్కడి నుంచి తహసీల్దార్ లాగిన్ దరఖాస్తు వెళ్తుతుంది. ఈ ప్రక్రి య మొత్తం కాగిత రహితంగా జరగనుంది. తహసీల్దార్ ఆమోదం అనంతరం మీసేవ కేంద్రం ద్వా రా దరఖాస్తుదారుడు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విధానంలో మార్పు లేనప్పుటికీ వాటిపై విచారణ పద్దతిలో మాత్రమే ప్రభుత్వం మార్పు తీసుకురానుంది.


