
ఎఫ్ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడు
విద్యారణ్యపురి: ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) డీఈఓగా వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా విధులు నిర్వర్తిస్తున్న బి.రంగయ్యనాయుడిని నియమిస్తూ కలెక్టర్ సత్యశారద శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఏడీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. డీఈఓ ఎం.జ్ఞానేశ్వర్ను రిలీవ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ ఈనెల 22న ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. డీఈఓగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కలెక్టర్ను కోరారు. ఈ నేపథ్యంలో రంగయ్యనాయుడిని ఎఫ్ఏసీ డీఈఓగా కలెక్టర్ నియమించారు.
విధుల్లో చేరేందుకు రంగయ్యనాయుడు విముఖత..
ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు రంగయ్యనాయుడు విముఖత చూపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నందున విధుల్లో చేరబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్కు కూడా తెలిపారని సమాచారం. ఈ విషయంపై సాక్షి ఆయనను వివరణ కోరగా తాను డీఈఓగా విధుల్లో చేరబోనని స్పష్టం చేశారు.
డీఈఓ కార్యాలయం ఎదుట సంబురాలు
డీఈఓ విధుల నుంచి జ్ఞానేశ్వర్ను రిలీవ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు శనివారం హనుమకొండలోని వరంగల్ డీఈఓ కార్యాలయం ఎదుట సంబురాలు చేసుకున్నారు. బాణ సంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునీల్ మాట్లాడుతూ డీఈఓ వైఖరి పై తమ సంఘం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. టీఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెరిపోతు ల వంశీకృష్ణ, బాధ్యులు నాగారం మణితేజ, హనుమకొండ జి ల్లా అధ్యక్షుడు కందుకూరి యువకిశోర్, ప్రధాన కార్యదర్శి రామంచ శ్రీను, కార్యదర్శి కోట నాగరాజు పాల్గొన్నారు.