
జనహితకు సిద్ధం!
స్వచ్ఛందంగా తరలిరావాలి..
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్రకు జిల్లాలో ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం 4:30 నుంచి ఇల్లంద మార్కెట్ నుంచి వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ వరకు, అనంతరం కార్నర్ మీటింగ్ ఉంటుంది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర సాగనున్న ఈ పాదయాత్రలో ఉమ్మడి జిల్లామంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాకు తొలిసారి రానున్న నేపథ్యంలో ఆమె పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టుదలతో ఉన్నారు. జనహిత పాదయాత్ర ఇన్చార్జ్లు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పులి అనిల్, జూలూరి ధనలక్ష్మీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, నమిండ్ల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనుబాబు, పల్లె శ్రీనివాస్ గౌడ్, మోత్కూరి ధర్మారావు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్షేత్రస్థాయిలో పర్యటించి పాదయాత్ర ఏర్పాట్లపై మార్గదర్శనం చేస్తున్నారు. ఇప్పటికే హనుమకొండలోని డీసీసీ భవన్లో కూడా పార్టీ ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర ఏర్పాట్లతో పాటు అది విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో అక్కడికొచ్చే వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
జనహిత పాదయాత్రతోనైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఉన్న సమన్వయలోపం గాడినపడుతుందా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వినబడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని కొందరు ముఖ్యనేతల మధ్య ఫిర్యాదుల పర్వం సాగింది. కొన్ని కార్యక్రమాల వేదికగా వారి మధ్య అనైక్యత కూడా రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికల వేళ ఈ ముఖ్యనేతల మధ్య ఈ పాదయాత్ర వల్లనైనా సయోధ్య కుదరాలని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ వీరికి ఏవిధంగా దిశానిర్దేశం చేస్తారోనని వేచిచూస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి పార్టీ పరిస్థితిపై పూర్తి స్థాయి నివేదికను అందుకున్న మీనాక్షి నటరాజన్ ఆ మేరకు ప్రజాప్రతినిథులతో మాట్లాడి పార్టీ పటిష్టత కోసం ఐక్యంగా ముందుకెళ్లాలని సూచిస్తారని తెలిసింది. అయితే రెండోరోజుల పాటు వీరి పర్యటన ఉండగా మంగళవారం నిర్వహించాల్సిన వర్ధన్నపేట పట్టణంలోని ఫిరంగిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రమదానం, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులతో సమావేశం అర్ధంతరంగా రద్దవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతి ముఖ్యమైన సమావేశం ఉంటే పార్టీ ముఖ్యులతో ఎక్కువ సమయం వెచ్చించడం ద్వారా పార్టీ బలోపేతానికి ఉపయోగపడేదని క్షేత్రస్థాయి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
వర్ధన్నపేటలో నేడు కాంగ్రెస్ నేతల పాదయాత్ర
పాల్గొననున్న కాంగ్రెస్ వ్యవహారాల
ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్
ఏర్పాట్లపై ఉమ్మడి జిల్లా
ప్రజాప్రతినిధుల సమీక్షలు
ఇల్లంద నుంచి వర్ధన్నపేట టౌన్ వరకు పాదయాత్ర
సభకు ఏర్పాట్లు చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హాజరుకానున్న పీసీసీ చీఫ్,
మంత్రులు, ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని విభాగాల శ్రేణులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి రెండో విడత జనహిత పాదయాత్రని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పార్టీ ముఖ్యనాయకులకు దిశానిర్ధేశం చేశారు. వర్ధన్నపేటటౌన్లోని ఎమ్మెల్యే అధికార క్యాంప్ కార్యాలయంలో ము ఖ్యఅతిథిగా వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో ఆదివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. అంతకుముందే ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించే స్థలాన్ని క్షేత్రస్థాయిలో నాయకుల, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన 20 నెలల్లో దేశంలోనే ఏ ప్రభుత్వం చేపట్టలేని అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు జరుగుతున్న నేపథ్యంలో ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుశాతం విజయం సాధించి తీరుతామని ఆశాభావం వ్యక్తంచేశారు.