
కాపర్వైర్ దొంగల అరెస్ట్
ఎల్కతుర్తి: పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైరును అపహరిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తెలిపారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన బండి కుమారస్వామి, బండి సతీష్లు గత కొంతకాలంగా ఎల్కతుర్తి, వేలేరు, భీమదేవరపల్లి, సైదాపూర్, హుజూరాబాద్, శంకరపట్నం తదితర ప్రాంతాల్లో రాత్రివేళల్లో 27 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి వాటిలోని కాపర్ వైర్ను అపహరించారు. దానిని అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తన సిబ్బందితో సోమవారం భీమదేవరపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అడ్డుకున్నారు. వారివద్ద కాపర్వైరు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టేందుకు ఉపయోగించే వస్తువులు ఉండడాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా సులువుగా డబ్బులు సంపాదించేందుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్ను దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన కాపర్ వైర్ను ముల్కనూర్ గ్రామానికి చెందిన రుద్రాక్ష తిరుపతికి అమ్మినట్లు విచారణలో తేలింది. వెంటనే తిరుపతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో నిందితులపై 2012నుంచి 53 కేసులు నమోదైనట్లు ఏసీపీ వెల్లడించారు. కాగా, నిందితులనుంచి రూ.2.50లక్షల విలువ గల 250 కిలోల కాపర్ వైర్, మోటర్ సైకిల్ను స్వాధీనపర్చుకొని వారిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ పులి రమేష్, ఎస్సైలు సాయిబాబు, ప్రవీణ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
250 కిలోల కాపర్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన కాజీపేట
ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి