కేజీబీవీ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ తనిఖీ

Aug 13 2025 7:38 AM | Updated on Aug 13 2025 4:06 PM

Excise Superintendent Arun Kumar conducted a surprise inspection

ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ అరుణ్‌కుమార్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ

గీసుకొండ: మండలంలోని వంచనగిరి కేజీబీవీని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ అరుణ్‌కుమార్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పాఠశాలలో మౌలిక వసతులతోపాటు వంటశాలను పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా..? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ మురళీధర్‌, పరకాల ఎక్సైజ్ పోలీస్‌ స్టేషన్‌ సీఐ తాతాజీ, తదితరులు పాల్గొన్నారు.

కేయూ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మేలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షల పలితాలు, దూరవిద్య కేంద్రం డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం మంగళవా రం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 31 శాతం, రెండో సెమిస్టర్‌లో 30 శాతం, మూడో సెమిస్టర్‌లో 35 శాతం, నాలుగో సెమిస్టర్‌లో 39 శాతం, దూరవిద్య మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో 24 శాతం ఉత్తీర్ణత సాధించారని పరీక్షల విభా గం అధికారులు తెలిపారు. రీ వాల్యుయేషన్‌కు ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. ఫలితాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. కాకతీయ.ఏసీ.ఇన్‌లో చూడాలని కోరారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ఎం.తిరుమలాదేవి, పద్మ, ఆసిం ఇక్బాల్‌, రాజు, మహేందర్‌, వెంకటయ్య అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ నేతా జీ, క్యాంపు ఆఫీసర్‌ సమ్మయ్య పాల్గొన్నారు.

నేచురోపతి సెంటర్‌తో కేయూ ఎంఈఓయూ

కేయూ క్యాంపస్‌: హనుమకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలోని ప్రొఫెసర్‌ గజ్జెల రామేశ్వరం ఇంటర్నేషనల్‌ నేచురోపతి లైబ్రరీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌తో కాకతీయ యూనివర్సిటీ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈమేరకు మంగళవారం సాయంత్రం యూనివర్సిటీలో నిర్వహించిన కేయూ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించి ఆమోదించారు. ఈఎంఓయూతో సైన్స్‌ లైఫ్‌సైన్సెస్‌, ఫార్మసీ, లైబ్రరీ సైన్స్‌ తదితర విభాగాల పీజీ విద్యార్థులు, పరిశోధకులు లైబ్రరీ రీసెర్చ్‌ సెంటర్‌ను వినియోగించుకోవచ్చు. త్వరలో నిర్వహించనున్న కేయూ పాలకమండలిలో దీనిని ఆమోదించనున్నారు. ఇదిలా ఉండగా మూడేళ్ల బీసీఏ, రెండేళ్ల ఎంసీఏ కోర్సు సిలబస్‌, డిగ్రీ కోర్సులకు సంబంధించి ఫస్టియర్‌ మొదటి సెమిస్టర్‌, సెకండ్‌ సెమిస్టర్‌ కామన్‌ కోర్‌ సిలబస్‌ను కూడా స్టాండింగ్‌ కమిటీ అప్రూవల్‌ చేసింది. పీహెచ్‌డీ స్కాలర్లలో రెగ్యులర్‌ స్కాలర్లు, స్కాలర్‌షిప్‌లు లేనివారికి ట్యూషన్‌ ఫీజు రూ.1000 తగ్గించాలని నిర్ణయించారు.

ఒక్కరోజు ఆదాయంలో వరంగల్‌–1 డిపో అగ్రస్థానం

హన్మకొండ: రాఖీ పండుగ ఒక్కరోజు ఆదాయంలో రాష్ట్రంలోనే ఆర్టీసీ వరంగల్‌–1 డిపో అగ్రస్థానంలో నిలిచింది. వరంగల్‌–1 డిపో ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి ఇప్పటి వరకు ఉన్న లక్ష్యాలను అధిగమించి కొత్తచరిత్ర సృష్టించారు. సోమవారం ఒక్కరోజు చార్జీలు చెల్లించిన ఆదాయంలో వరంగల్‌–1 డిపో టాప్‌ వన్‌లో నిలిచింది. రాష్ట్రంలోని ఆర్టీసీ 97 డిపోల్లో వరంగల్‌–1 డిపో టికెట్‌ చార్జీల ద్వారా రూ.49.14 లక్షల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల 11న 79,057 కిలోమీటర్లు బస్సులు తిరిగి మహాలక్ష్మి ఉచిత ప్రయాణికులతోపాటు టికెట్‌ చార్జీల ద్వారా మొత్తం 55,767 ప్రయాణికులను చేరవేసి 102 ఆక్యుపెన్సీ రేషియో ద్వారా రూ.62 లక్షల ఆదాయాన్ని సాధించింది. ఇందులో టికె ట్‌ ద్వారా రూ.49.14 లక్షలు, మహాలక్ష్మి ఉచిత ప్రయాణం ద్వారా రూ.12.87 లక్షల ఆదాయం వచ్చింది.

నేడు, రేపు స్కూళ్లకు సెలవులు

విద్యారణ్యపురి: భారీవర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ సూచన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ పరిధి హనుమకొండ , వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో బుధ, గురువారాలు (రెండు రోజులు) పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఈఓలకు ఉత్తర్వులు అందాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విధిగా సెలవులు పాటించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement