
తల్లిపాలతో ఆరోగ్యం
ఎంజీఎం/న్యూశాయంపేట/రామన్నపేట/సంగెం: తల్లిపాలు తాగితే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిపాలు తాగిన చిన్నారులు రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. శిశువు పుట్టిన గంటలోపు ముర్రుపాలు తప్పకుండా తాగించాలన్నారు. శిశువుకు తప్పనిసరిగా ఆరు నెలలు తల్లిపాలను తాగించాలని సూచించారు. బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెయింట్ ఆన్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు బాలింతలు, గర్భిణులకు తల్లిపాల విశిష్టతను వివరిస్తూ వేసిన నాటకం ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, వైద్యాధికారులు సత్యజిత్ తదితరులు పాల్గొన్నారు.
పంద్రాగస్టుకు పటిష్ట ఏర్పాట్లు
పంద్రాగస్టు వేడుకలను పండువాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15న ఉదయం ఖిలా వరంగల్ ఖుష్మహల్ మైదానంలో నిర్వహించే జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు, వేదిక అలంకరణ చేయాలని ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, ఇతర అతిథులను వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జిల్లా అఽధికారులు రాంరెడ్డి, సాంబశివరావు, కౌసల్యాదేవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను కలెక్టర్ పరిశీలించారు. అలాగే నగరంలోని 3వ డివిజన్ పైడిపల్లిలోని డబుల్బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. 11వ చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా వరంగల్ కొత్తవాడలోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కెమిస్టు భవన్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్ను పథకాలు, సదుపాయాలను వినియోగించుకుని చేనేత కార్మికులు ఎదగాలని సూచించారు. అలాగే సంగెం ఎంపీడీఓ, తహసీల్దార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనికీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం, మూమెంట్ రిజిస్టర్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నిమిత్త గ్రామాలకు వెళ్లిన వారి లైవ్ లొకేషన్ పెట్టాలని ఆదేశించారు. షోకాజ్ మెమో జారీ చేస్తూ ఇంక్రిమెంట్లు ఆపాలని ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ పీఆర్ ఏఈ అభిరామ్, సీనియర్ అసిస్టెంట్ ఓంప్రకాశ్, జూనియర్ అసిస్టెంట్లు రజిత, షాబుద్దిన్, టైపిస్ట్ శోభ, ఫార్మసిస్టు వెంకటేశ్వర్లు, రెండో ఏఎన్ఎం సుజాతలకు మెమోలు జారీ చేశారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద

తల్లిపాలతో ఆరోగ్యం