
దాడిచేసిన 8 మందిపై కేసు
సంగెం: దాడి చేసిన 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 3వ తేదీన రాత్రి రామచంద్రాపురం గ్రామానికి చెందిన నక్క ప్రవళిక కూతురికి చెవులు కుట్టించే ఫంక్షన్ చేస్తోంది. అదే గ్రామానికి చెందిన జక్క సతీశ్, శ్రీనివాస్, సుధాకర్, కత్తుల రాజాలు, నాగరాజు, ఇటుకాలు కరుణాకర్, జక్క శ్రీకాంత్, చిదురాల శ్రీను వచ్చి పాతకక్షలు మనసులో పెట్టుకుని ప్రవళిక కుటుంబ సభ్యులపై దాడి చేసి చంపుతామని బెదిరించారు. ప్రవళిక ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
‘కిషోర రక్ష’ పరిశీలన
గీసుకొండ: మండంలోని వంచనగిరి కేజీబీవీలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలు అవుతున్న కిషోర రక్ష ఆరోగ్య కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు బుధవారం పరిశీలించారు. విద్యార్థినుల కోసం చేస్తున్న వంట, కిచెన్ గార్డెన్తో పాటు పాఠశాల పరిసరాలు ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.
మురుగునీటి తొలగింపు
దుగ్గొండి: మండల కేంద్రంలోని రైతు వేదిక– అంగన్వాడీ కేంద్రం మధ్య పేరుకుపోయిన మురుగునీటిని తొలగించారు. ‘అలా.. కవర్ చేశారు’ శీర్షికన బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఇన్చార్జ్ కార్యదర్శి నూనె వేణుకుమార్ జేసీబీ సాయంతో కందకం తీయించి గుంతలో నుంచి నీటిని తొలగించారు. మట్టి పోయించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మనుబోతులగడ్డలో
ట్రాక్టర్ దహనం
ఖానాపురం: గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్టర్ను దహనం చేసిన సంఘటన మనుబోతులగడ్డలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం...గ్రామానికి చెందిన బానోత్ ఈర్యనాయక్ తన ట్రాక్టర్ను సాయంత్రం ఇంటి వద్ద పార్కింగ్ చేశాడు. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఆగంతకులు పెట్రోల్ పోసి ట్రాక్టర్ను అంటించి వెళ్లిపోయారు. ఉదయాన్నే చూడగా ట్రాక్టర్ ఇంజన్ దగ్ధమై ఉండడాన్ని గమనించారు. ట్రాక్టర్ ఇంజన్ వద్ద అగ్గిపుల్లలతో పాటు పెట్రోల్ ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి ఎస్సై రఘుపతి చేరుకుని వివరాలు సేకరించారు. రూ.1.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ట్రాక్టర్ను మాజీ ఎంపీపీ ప్రకాశ్రావు, నాయకులు సోమయ్య, అశోక్యాదవ్, శ్రీనివాస్, పూలునాయక్ పరిశీలించారు. నిందితులను తక్షణమే గుర్తించి శిక్షించాలని కోరారు.
బీజేపీకి అండగా నిలవాలి
పార్టీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్
వర్ధన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ కోరారు. బీజేపీ మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఇల్లంద గ్రామ కేంద్రంలో గడప గడపకు వెళ్లి బీజేపీ పాలనను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. మండల కన్వీనర్ రాయపురపు కుమారస్వామి, మండల ప్రభారి గోకే వెంకటేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి సత్యం ఉన్నారు.

దాడిచేసిన 8 మందిపై కేసు