టెన్త్ @ 96.13
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
గతేడాదికంటే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం
● ఫలితాల్లో రాష్ట్రంలో హనుమకొండ జిల్లాది 18వ స్థానం
● బాలురకంటే బాలికలదే పైచేయి
విద్యారణ్యపురి: టెన్త్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. హనుమకొండ 96.13 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 12,007 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. అందులో 11,542 మంది(96.13శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 6,343 మంది పరీక్షలకు హాజరుకాగా.. అందులో 6,063 మంది ఉత్తీర్ణత (95.59 శాతం) సాఽధించారు. ఈఫలితాల్లో బాలురకంటే స్వల్పంగా బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికలు 5,664 మంది పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 5,479 మంది ఉత్తీర్ణత (96.73 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
స్వల్ప పెరుగుదల..
గతేడాది 2024లో హనుమకొండ జిల్లా 95.99 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈఏడాది 96.13 శాతం ఉత్తీర్ణత సాఽధించింది. గతేడాదితో పోలిస్తే ఈఏడాది స్వల్పంగానే ఉత్తీర్ణతశాతం పెరిగింది. 2022లో 96.07శాతం ఉత్తీర్ణత సాధించారు. 2023లో టెన్త్ పరీక్షల ఫలితాల్లో జిల్లాలో విద్యార్థులు 91.05శాతం పాసయ్యారు.
కేజీబీవీల్లో 94.1శాతం ఉత్తీర్ణత
జిల్లాలో 9 కేజీబీవీల్లో 373 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 351 మంది 94.1శాతం ఉత్తీర్ణత సాఽధించారు. ఐనవోలు కేజీబీవీ విద్యార్థి ఎన్.సిరి 600 మార్కులకు 569 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.
మోడల్స్కూళ్లలో 94శాతం ఉత్తీర్ణత
ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్లో కలిపి 3 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. 247 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. వారిలో 233 మంది ఉత్తీర్ణత (94శాతం) సాఽధించారు. భీమదేవరపల్లి మోడల్ స్కూల్లో 92 మంది విద్యార్థులకుగాను 92 మంది ఉత్తీర్ణత (100శాతం) సాధించారు. కాగా.. ఈసారి గతానికి భిన్నంగా టెన్త్ పరీక్షల ఫలితాల్లో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా మార్కులతో సహా గ్రేడ్లను కూడా వెల్లడించారు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్..
మార్కులు తిరిగి లెక్కించాలని కోరే విద్యార్థులు రీకౌంటింగ్ కోసం రూ.500 చొప్పున 15 రోజుల్లోగా చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీ వెరిఫికేషన్కు రూ.1,000 చెల్లించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు సంబంధిత పాఠశాలలో హాల్టికెట్ జిరాక్స్ కాపీతోపాటు కంప్యూటరైజ్డ్ ప్రింటెడ్ కాపీతో రీ వెరిఫికేషన్కు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేసి డీఈఓ కార్యాలయంలో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే అంగీకరించనున్నారు.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష..
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు మే 16 వరకు గడువు ఉంది.
ప్రభుత్వ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 88.06
జిల్లా పరిషత్ విద్యార్థులు 90.15 శాతం
జిల్లాలో 140 హైస్కూళ్లలో వందశాతం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్ల, గురుకులాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జిల్లాలో ప్రభుత్వ హైస్కూల్స్ విద్యార్థులు 712 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 627 మంది (88.06శాతం) ఉత్తీర్ణత సాధించారు. జిల్లా పరిషత్ హైస్కూల్స్లో 1.837మందికిగాను 1,656 మంది (90.15శాతం) ఉత్తీర్ణత సాఽధించారు. ఎయిడెడ్ స్కూళ్లలో 158 మందికి 152 మంది ఉత్తీర్ణత (96.20 శాతం) సాధించారు. టీఎస్ఆర్ ఈఐఎస్ స్కూల్స్లో 210 మందికి గాను 210 మంది ఉత్తీర్ణత (100 శాతం) సాధించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) 756 మందికి 745 మంది (98.54 శాతం) సాధించారు. టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ 79 మందికి 79 మంది (వందశాతం) ఉత్తీర్ణత సాధించారు. బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో 610 మందికి 606 మంది ఉత్తీర్ణత (99.34శాతం), మైనార్టీ గురుకులాల్లో 257 మందికి 250 (97.28శాతం), ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో 73 మందికిగాను 66 మంది 90.41శాతం ఉత్తీర్ణత సాధించినట్లు హనుమకొండ డీఈఓ వాసంతి తెలిపారు.
ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా..
హనుమకొండ జిల్లాలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లలో 6,695 మంది విద్యార్థులకు 6,567 మంది 98.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. హనుమకొండ జిల్లాలో 318 హైస్కూళ్లలో 140 హైస్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో 57 ప్రభుత్వ యాజమాన్యాల స్కూళ్లు, 83 ప్రైవేట్ హైస్కూల్లు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.


