జిల్లాలో తాజాగా ఇద్దరి ఉద్యోగుల సస్పెన్షన్
అక్రమార్కుల్లో భయాందోళన..
వనపర్తి: అవినీతి, అక్రమాలు, విధుల్లో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం, శాఖాపరమైన అవకతవకల ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు, ఉద్యోగులు వరుసగా చర్యలకు గురవుతున్నారు. తాజాగా మంగళవారం మరో ఇద్దరి ఉద్యోగుల సస్పెన్షన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రెండేళ్ల కాలంలో సస్పెండ్ అయిన వారి లెక్క తీస్తే.. సుమారు 17 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ఇందులో నలుగురు జిల్లాస్థాయి అధికారులు, ఎనిమిది మంది పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు వార్డెన్లు, ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, జిల్లా పౌరసరఫరాలశాఖలో పనిచేసే ఉద్యోగి ఒకరు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఇటు కలెక్టర్, అటు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సైతం తప్పు చేసినట్లు విచారణలో వెల్లడైతే చర్యలకు వెనకాడటం లేదనేందుకు మంగళవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఇద్దరిపై వేటు వేయడంతో స్పష్టమవుతోంది. వసతి గృహానికి చేరాల్సిన 15 క్వింటాళ్ల బియ్యం లెక్క విషయంలో జిల్లాకేంద్రంలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్ నరేందర్రెడ్డి, పౌరసరఫరాలశాఖలో పనిచేసే ఉద్యోగి మహేష్పై వేటు పడింది. ఈ ఘటన జిల్లాలో ఉద్యోగ లోకానికి షాక్ తగిలినట్లయింది. దీంతో రెండేళ్ల కాలంలో చర్యలకు గురైన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల విషయంపై చర్చ వినిపిస్తోంది.
రెండేళ్లలో 17 మందికిపైగా..
ఇందులో నలుగురు జిల్లాస్థాయి
అధికారులు
ఇద్దరు వార్డెన్లు, ఎనిమిది మంది
కార్యదర్శులు, ఎస్ఐ, ఏఎస్ఐ...
అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినా.. అక్రమార్జనకు పాల్పడినట్లు ఆధారాలతో వెల్లడైనా.. ప్రతి ఘటనలో చర్యలకు వెనకాడకపోవటం జిల్లా అధికార యంత్రాంగంలో భయాందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. హాస్టల్లో ఉంటూ.. చదువుకునే పేదవారి కడుపుకొట్టి బియ్యాన్ని విక్రయించుకునే వారిపై కలెక్టర్ సీరియస్గా స్పందించినట్లు తాజా చర్యలతో వెల్లడవుతోంది.


