వనపర్తి: ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని 30వ వార్డులో ఉన్న షెడ్యూల్డ్ కులాల బాలుర వసతిగృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలో కొత్తగా నిర్మించిన వంటగది (కిచెన్), స్టోర్రూమ్ను పరిశీలించారు. పనుల నాణ్యత, వినియోగంలో ఉన్న సామగ్రి తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణాలు నిర్దేశించిన అంచనాల ప్రకారమే చేపట్టాలని, అదనపు పనులు చేపట్టరాదని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మరో నెలలో భవనాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం వసతిగృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. వసతిగృహాల్లో శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని.. వంటగది, భోజనశాల, మరుగుదొడ్లు తదితర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్యాభ్యాసానికి అనుకూలమైన వాతావరణం కల్పించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్ వెంట ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రాంజీరావు, తహసీల్దార్ రమేష్రెడ్డి, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.


