వనపర్తి: ప్రత్యేక ఓటరు నమోదు శిభిరాలను ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నామని.. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి, ప్రత్యేక ఓటరు నమోదు శిభిరాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆయా తేదీల్లో బూత్స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. 2026, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఫారం–6, ఓటరు వివరాల్లో సవరణల కోసం ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక శిభిరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. కొత్త ఓటరు నమోదుకు వయస్సు, చిరునామా ధ్రువీకరణ పత్రం, డిక్లరేషన్తో పాటు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు సమర్పించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వ్యక్తిగతంగా రావడం సాధ్యం కానివారు ఆనన్లైనన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్ల నోటీసుల పరిష్కారంపై బీఎల్వోలు, ఏఈఆర్వోలు చురుగ్గా పనిచేస్తున్నారని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే టోల్ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


