వనపర్తి రూరల్: పెబ్బేరులోని సాయిగోపాల ఇండోటెక్ ప్లాంట్ రైస్మిల్లు యజమానిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్గౌడ్ తెలిపారు. 2022–23 యాసంగి సీజన్లో ప్రభుత్వం అప్పగించిన వరి ధాన్యం లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు పౌరసరఫరాల అధికారులు గుర్తించారన్నారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి సీఎంఆర్ పూర్తిస్థాయిలో అందించకపోవడంతో సుమారు రూ.10 కోట్లకుపైగా నష్టం వాటినట్లు ప్రాథమికంగా నిర్ధారించారని, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు.
సంఘటితంతోనే ఉత్తమ ఫలితాలు
అమరచింత: అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం బలోపేతానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని నాబార్డు డీడీఎం మనోహర్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2019లో ప్రారంభమైన సంఘం ప్రస్తుతం గుర్తింపు పొందిన స్థాయికి చేరుకోవడం సంతోషకరమన్నారు. చేనేత కార్మికులు సంఘటితంగా పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలరని తెలిపారు. కార్యక్రమంలో వీవర్ సర్వీస్ సెంటర్ శ్రీనివాసులు, సంఘం సీఈఓ చంద్రశేఖర్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఘనంగా చేనేత ర్యాలీ..
జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం పట్టణంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులంతా పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి జై చేనేత అంటూ నినాదాలు చేశారు. బస్టాండ్ కూడలిలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత సహకార సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వృద్ధ చేనేత కా ర్మికులను పాలకవర్గం సన్మానించింది. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు తిరుమల రఘురాం, కోటకొండ చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాసులు, కౌన్సిలర్లు మేర్వ రాజు, పారుపల్లి ఉశన్న, అమరచింత చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు పారుపల్లి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మేర్వ అనిల్, కోశాధికారి మ్యాడం కృష్ణయ్య పాల్గొన్నారు.


