వనపర్తి: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సీ్త్రనిధి పథకంలో తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని సకాలంలో తిరిగి చెల్లించాలని.. వసూలు చేసిన డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా దుర్వినియోగం చేసినా, అక్రమాలకు పాల్పడినా చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీ్త్ర నిధి జోనల్ మేనేజర్ టీవీ రవికుమార్ అధ్యక్షతన ఏపీఎం, గ్రామీణాభివృద్ధిశాఖ సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని రుణాలు గ్రౌండింగ్ చేశారు.. రికవరి ఎంత చేశారు అనే వివరాలను జోనల్ మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలు, పురపాలికల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు మంజూరు చేసినా.. తిరిగి వసూలు చేసే విషయంలో జిల్లా చాలా వెనుకబడి ఉందని వివరించారు. కొందరు వీఓలు సభ్యుల నుంచి రుణాలు వసూలు చేసి బ్యాంకుకు చెల్లించకుండా దుర్వినియోగం చేస్తున్నారని వివరించారు. స్పందించిన కలెక్టర్ రుణాలు పొందిన సభ్యుల నుంచి డబ్బులు తిరిగి బ్యాంకుకు చెల్లించే విధంగా ఏపీఎంలు, వీఓలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మొండి బకాయిల కింద మారకుండా చూసుకునే బాధ్యత వీఓలదేనన్నారు. డబ్బులు బ్యాంకులో జమ చేయని వీఓలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు, వడ్డీ వ్యాపారాలను అరికట్టడానికి ప్రభుత్వం సీ్త్ర నిధి పథకం ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తోందని.. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం మేరకు రుణాలు అందించే విధంగా జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చూడాలని కోరారు.


