విద్యార్థులు ఇలా..
● నేటి నుంచి ప్రారంభం
● ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు
● ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
వనపర్తిటౌన్: జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు.. ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11 వరకు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 7,212 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. ఇందులో బాలురు 3,577 మంది, బాలికలు 3,635 మంది ఉన్నారు. వీరితో పాటు ప్రైవేట్ విద్యార్థులు 16 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 37 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 25 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో, 12 కేంద్రాలు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి. అత్యధికంగా జిల్లాకేంద్రంలో 9, కొత్తకోటలో 5, పెబ్బేరు 4, ఆత్మకూర్లో 3, వీపనగండ్ల, చిన్నంబావి, రేవల్లిలో ఒక్కోటి, మిగతా మండలాల్లో రెండేసి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. ప్రశ్నపత్రాలను వాటి ముందే నిర్దేశిత సమయంలో తెరవనున్నారు. కేంద్రాల్లోకి సీఎస్, డీఓల మొదలుకొని ఎవరికి సెల్ఫోన్ అనుమతించ లేదు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో శుక్రవారం హాల్టికెట్ నంబర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాలను జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, సహాయ పరీక్షల అధికారి గణేష్కుమార్ పరిశీలించి సీఎస్, డీఈలకు పలు సూచనలు చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బెంచీలు, తాగునీరు, పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ, పుర పారిశుద్ధ్య కార్మికులతో ఆవరణలను శుభ్రం చేయించారు. విద్యార్థులను అరగంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఉంటుందని.. దాటిన తర్వాత అనుమతించమని అధికారులు తెలిపారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ వాచ్లను అనుమతించమని చెప్పారు.
పరీక్షల నిర్వహణకుగాను 375 మంది ఇన్విజిలేటర్లు, 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 37 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. సిట్టింగ్ స్క్వాడ్లు, పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులతో కలిపి ముగ్గురి చొప్పున రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించనున్నాయి. పరీక్ష సమయంలో కేంద్రాల ఆవరణలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో పాటు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కేంద్రంలో వైద్య సేవల కోసం ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండనున్నారు.
గురుకుల విద్యార్థులు 996
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 115


