డేకేర్ సెంటర్లో వసతులు కల్పించాలి..
వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా 2025 ఓటరు జాబితాను 2002 ఎస్ఐఆర్తో మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగంగా చేపడుతున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు 67 శాతం పూర్తయిందని, పెండింగ్ పని త్వరగా పూర్తి చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వనపర్తి మండలంలో మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని.. బూత్ లెవల్ అధికారులు తమ బాధ్యతలను కచ్చితంగా నిర్వర్తించాలన్నారు. పనులను నిర్లక్ష్యం చేసే అధికారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైతే వేతనాలు నిలిపివేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో డి సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, తహసీల్దార్ రమేష్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వంట గ్యాస్ కొరత లేదు..
జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్, గృహ అవసరాలు, విద్యాలయాలు, ఆస్పత్రులకు అవసరమైన ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని, అవసరమైన మేరకు సరఫరా చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల సమస్య లేదని, విద్యాలయాలు, ఆస్పత్రులకు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వంట గ్యాస్ను 15 రోజులకు బదులు 25 రోజులకు బుక్ చేసుకునేలా అవకాశం కల్పించామన్నారు. యాసంగి పంటల కోతలు వారం రోజుల్లో ప్రారంభం అవుతాయని.. సాగునీటి సమస్యలు ఎక్కడా ఉత్పన్నం కాలేదని చెప్పారు. తాగునీటికి సైతం ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తుగానే గోదాంలు, అవసరం మేరకు గన్నీ బ్యాగులు సమకూర్చడంపై దృష్టి సారిస్తామన్నారు. వీడియో కాన్ఫరెనన్స్లో ఎస్పీ డి.సునీతరెడ్డి, ఇరిగేషన్శాఖ సీఈ నాగేందర్, ఎస్ఈ చంద్రశేఖర్, ఈఈ కేశవరావు, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్, ఈఈ మిషన్ భగీరథ ఎండీ అంజాద్పాషా తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలో వృద్ధుల కోసం ఏర్పాటుచేసిన డేకేర్ సెంటర్లో కావాల్సిన వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని రాంనగర్లో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ డేకేర్ సెంటర్ ‘ప్రణామ్’ను ఆయన సందర్శించారు. కేంద్రంలోని వసతులను పరిశీలించి అక్కడే ఉన్న పలువురు సీనియర్ సిటిజన్లతో మాట్లాడారు. వారికి అందిస్తున్న సేవల గురించి తెలుసుకుని అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. డేకేర్ సెంటర్ను ఉగాది నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఆయన వెంట జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, తహసీల్దార్ రమేష్రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


