
క్రీడా శిక్షణకు వేళాయె..
30 రోజుల శిక్షణ..
జిల్లాలో మే నెల 1 నుంచి 31 వరకు విద్యార్థులకు వివిధ క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే శిక్షకులకు అన్నిరకాల సూచనలు చేశాం. 14 ఏళ్లలోపు బాలలు శిక్షణలో పాల్గొనే అవకాశం ఉంది. శిబిరంలో ఎంతమంది విద్యార్థులైనా పాల్గొనవచ్చు. శిక్షకులకు రూ.4 వేల గౌరవ వేతనం చెల్లిస్తూ విద్యార్థులకు తర్ఫీదునిచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. – సురేందర్రెడ్డి, డీవైఎస్ఓ
అమరచింత: ప్రభుత్వం వేసవి సెలవుల్లో బడిఈడు పిల్లలు చెడుదారి పట్టకుండా వారికి క్రీడలపై మక్కువ పెంచేందుకు నచ్చిన ఆటలను పరిచయం చేస్తూ వాటిలో తర్ఫీదునిచ్చేందుకు వేసవి క్రీడా శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ శిబిరాలు మే నెల 1 నుంచి నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ తదితర క్రీడల్లో నైపుణ్యాలు గల శిక్షకుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి శిక్షణ కేంద్రాలు మంజూరు చేశారు. ఇప్పటికే కేంద్రాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని.. క్రీడా శిక్షకులకు ప్రతి నెల ప్రభుత్వం రూ.4 వేల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఆసక్తిగల 14 ఏళ్లలోపు విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకొని శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
జిల్లాలో 10 కేంద్రాలు..
జిల్లాలోని మదనాపురం, గోపాల్పేట, ఏదుట్ల, వీపనగండ్ల, ఖిల్లాఘనపురం, పాన్గల్, కొత్తకోట, ఆత్మకూర్, మూలమళ్లతో పాటు జిల్లాకేంద్రంలో అధికంగా క్రీడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మండలాల్లోని పీఈటీల ప్రోత్సాహంతో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మొత్తంగా 10 శిబిరాలు వేసవిలో కొనసాగిస్తున్నారు.
క్రీడాసామగ్రి పంపిణీ..
వేసవి క్రీడా శిబిరాలకు ప్రభుత్వమే ఉచితంగా క్రీడా సామగ్రిని అందిస్తుందని జిల్లా క్రీడలు, యువజనశాఖ అధికారి తెలిపారు. వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ కిట్లు, అథ్లెటిక్స్ సామగ్రిని ఆయా కోచ్లకు జిల్లాకేంద్రంలో అందిస్తున్నట్లు చెప్పారు. శిక్షణకు వచ్చే విద్యార్థులు వీటిని వినియోగించుకొని కోచ్ వద్ద భద్రపర్చుకోవాలని సూచించారు. ప్రథమ చికిత్స కిట్ల కొనుగోలుకుగాను జిల్లాకు రూ.5 వేలు మంజూరయ్యాయని తెలిపారు.
జిల్లాలో మే నెల 1 నుంచి తరగతులు ప్రారంభం
జిల్లావ్యాప్తంగా 10 శిబిరాలు ఏర్పాటు
శిక్షకులకు గౌరవ వేతనం చెల్లింపు
14 ఏళ్లలోపు విద్యార్థులకు అవకాశం
శిక్షణతో ప్రయోజనం..
30 రోజుల క్రీడా శిక్షణతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే ఆటల పోటీలతో పాటు డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. వేసవి సెలవులు వృథా కాకుండా రోజు ఉదయం ఎనిమిది వరకు, సాయంత్ర ఐదు నుంచి ఆరు వరకు శిక్షణ ఇవ్వనున్నారు.

క్రీడా శిక్షణకు వేళాయె..