
గ్యారంటీ ఇచ్చే మిల్లులకే యాసంగి ధాన్యం
వనపర్తి: జిల్లాలో మిల్లర్లు ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన ధాన్యం క్లియర్ చేసి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేవారికే యాసంగి వరి ధాన్యం కేటాయించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ అప్పగింతపై గురువారం అదనపు కలెక్టర్లు, రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులతో వీసీ నిర్వహించారు. జిల్లాలలో నిర్దేశించుకున్న మేరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో 481 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు లక్ష్యంగా పెట్టుకొని.. ఇప్పటికే 379 కేంద్రాలను ప్రారంభించామన్నారు. జిల్లాలో 178 మిల్లులు ఉండగా చాలా వరకు డిఫాల్ట్ అయి కేసులు నమోదు చేసి ఉన్నాయన్నారు. యాసంగి ధాన్యం కేటాయించేందుకు ప్రస్తుతం 11 మిల్లులతో ఒప్పందం చేసుకున్నామని, ఇంకా బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వలేదని చెప్పారు. సమావేశంలో సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథ్, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా కోఆపరేటివ్ అధికారి రాణి, సివిల్ సప్లయ్ డీఎం జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
పరిమితికి మించి
వైద్యం చేస్తే చర్యలు
ఆత్మకూర్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిమితికి మించి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆత్మకూర్లోని 8 ప్రైవేట్ ఆస్పత్రులు, 2 డెంటల్ ఆస్పత్రులు, 8 ల్యాబ్లను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లోని రికార్డులను పరిశీలించి వైద్యుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్ వైద్యులు మాత్రమే వైద్యం చేయాలని, అవసరం లేకున్న పరీక్షల పేరిట రోగుల ద్వారా డబ్బులు లాగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆర్ఎంపీలు టైఫాయిడ్, మలేరియా ఇతర జ్వరాలకు సైతం వచ్చీరాని వైద్యం చేస్తున్నట్లు ఇది వరకే ఫిర్యాదులు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించి వైద్యం చేస్తున్న ఆస్పత్రులకు నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. డీఎంహెచ్ఓ వెంట వైద్యులు వంశీకృష్ణ, రాజు, రవికుమార్ తదితరులున్నారు.
చెరుకు రైతులకు
బకాయిలు చెల్లించండి
అమరచింత: జిల్లాలో కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన రైతులకు బకాయిపడిన రూ.6 కోట్లు వెంటనే చెల్లించాలంటూ కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ఫ్యాక్టరీ కార్యాలయంలో ఈడీ రవికుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు కోతలు పూర్తయినా ఇప్పటి వరకు చెరుకు రైతులకు బకాయి డబ్బులను చెల్లించడం లేదన్నారు. బకాయిల చెల్లింపు వ్యవహారంపై పలుమార్లు ఫ్యాక్టరీ ఏజీఎం, డీజీఎంలకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే జీఎం కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు రూ.4.50 కోట్లను చెల్లించామని ఈడీ చెరుకు కార్మిక సంఘం నాయకులకు వెల్లడించారు. దీంతో మిగిలిన మొత్తం వెంటనే రైతు ఖాతాలలో జమ చేయాలని కోరగా.. వారం రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చెరుకు రైతు సంఘం నాయకులు వాసారెడ్డి, చంద్రసేనారెడ్డి, ఆంజనేయలు, నాగేంద్రం, రంగారెడ్డి, షాలిమియా తదితరులు పాల్గొన్నారు.

గ్యారంటీ ఇచ్చే మిల్లులకే యాసంగి ధాన్యం

గ్యారంటీ ఇచ్చే మిల్లులకే యాసంగి ధాన్యం