
ప్రమాదకర స్తంభాలు
● ఇనుప పోల్స్ తొలగింపులో జాప్యం
● కొన్నిచోట్ల సిమెంట్ స్తంభాలు శిథిలం
● భయాందోళనలో ప్రజలు
వనపర్తిటౌన్: జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలు తొలగించి వాటి స్థానంలో సిమెంట్వి ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాకేంద్రంలోని కమాన్ చౌరస్తా, హనుమాన్ టేకిడీ, మసీద్ రోడ్, గాంధీచౌక్, శంకర్గంజ్, రాయిగడ్డ, పెబ్బేర్, కొత్తకోటలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఇనుప స్తంభాలే ఉండటంతో పాటు సరైన రీతిలో లేని పరిస్థితి. భారీ వాహనాలు రాత్రిళ్లు అదుపుతప్పి ఢీ కొట్టడంతో చాలావరకు ఒరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. జిల్లాకేంద్రంతో పాటు పెబ్బేరు, కొత్తకోటలో ఇలాంటి స్తంభాలు కనిపిస్తున్నా అధికారులు స్పందించి తొలగించకపోవడం గమనార్హం. గతేడాది విద్యుత్ అధికారులు ఒరిగిన, శిథిలావస్థలో ఉన్న స్తంభాల వివరాలు సేకరించినా.. ఆ వివరాలు సైతం వెల్లడించేందుకు వెనుకాడుతున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు..
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ప్రజాప్రతినిధుల పర్యటనకు వచ్చినప్పడు అధికారులు హడావుడి చేయడం తప్పితే వాటి తొలగింపునకు, కొత్తవి ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపట్టం లేదు. కొన్నిచోట్ల దుకాణాలకు ఎదురుగా సపోర్టుతో స్తంభాలు ఏర్పాటుచేసి వదిలేశారు. ఇటీవల జిల్లాకేంద్రంలోని బస్టాండ్ రోడ్లో ఓ ఇనుప స్తంభాన్ని కారు ఢీ కొటడ్డంతో రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. అదేవిధంగా కొన్నిచోట్ల సిమెంట్ స్తంభాలు నెలకొరుగుతున్నా పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గాంధీనగర్, ప్యాటగడ్డ, రాయిగడ్డ, పాతబజార్, బాలానగర్, పీర్లగుట్ట తదితర ప్రాంతాల్లో నేటికీ శిథిల, ప్రమాదకర స్తంభాలు కనిపిస్తున్నాయి. వీటితో వాహనాలతో పాటు ప్రజలు ప్రమాదాల బారినపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ప్రమాదకర స్తంభాలు