
సకాలంలో ధాన్యం కొనుగోళ్లు
అమరచింత: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తున్నామని, రైతుల నుంచి వరి ధాన్యం సకాలంలో కొనుగోలు చేస్తున్నామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని నాగల్కడ్మూర్, పాంరెడ్డిపల్లిలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అదేవిధంగా ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. నాగల్కడ్మూర్లోని దళితవాడలో సోనియమ్మ ఇంట్లో రేషన్ సన్నబియ్యంతో వండిన భోజనం అధికారులతో కలిసి చేశారు. గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఆ ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. రూ.రెండు లక్షల పంట రుణమాఫీ, సన్నరకం వరి ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ అందించామన్నారు. యాసంగిలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. రైతుల నుంచి వచ్చిన ప్రతి గింజా కొనడమే కాకుండా సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సీసీ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, బీటీ రహదారులతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని.. ప్రజా ప్రభుత్వంలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ కర్తవ్యమన్నారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, తహసీల్దార్ రవికుమార్ యాదవ్, ఏపీఎం కృష్ణవేణి, ఏఓ అరవింద్, కాంగ్రెస్పార్టీ నాయకులు మహేందర్రెడ్డి, అరుణ్కుమార్, తిరుమల్లేశ్, మహంకాళి విష్ణు పాల్గొన్నారు.