
‘ప్రాధాన్యత రంగాలను విస్మరించారు’
వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధాన రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించలేదని సీపీఎం జిల్లా నాయకుడు ఎండి జబ్బార్ ఆరోపించారు. శనివారం మండలంలోని బొల్లారం గ్రామంలో నిర్వహించిన పార్టీ మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేశారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించకపోవడం, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కృతనిశ్ఛయంతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 100 శాతం పంట రుణమాఫీ, రైతుభరోసా, మహాలక్ష్మీ పథకం, కొత్త ఆసరా పింఛన్లు, వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా వంటి పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బాల్రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణయ్య, మహబూబ్పాషా, రవిప్రసాద్, నాయకులు బాలగౌడ్, ఆశన్న, ఈశ్వర్, కృష్ణయ్య, నిరంజన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.