● ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలో వక్తలు
విజయనగరం: ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రమేష్నాయుడు అధ్యక్షతన ఆరో జిల్లా మహాసభలు శనివారం జరిగాయి. ఇందులో పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిజం వృత్తి సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు పెన్షన్ తదితర సంక్షేమ పథకాలు సాధించేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఫెడరేషన్ ముందుంటుందన్నారు. డీపీఆర్ఓ పి.గోవిందరాజులు, రాష్ట్ర నాయకులు ఎన్.మధుసూదనరావు, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి భీమారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా శివకేశవనాయుడు, అప్పారావు ఎన్నికయ్యారు.


