నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవను ఆలయ అర్చకులు శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిపించారు. శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఉంచి దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశారు. ఈ సందర్భంగా సహస్ర దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి విశేష అర్చనలు, ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
8మంది మేకల దొంగల అరెస్ట్
మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస, కాశీపట్నం, తూరుమామిడి గ్రామాలకు చెందిన పలువురి మేకలు ఇటీవల చోరీకి గురికాగా పోలీస్ స్టేషన్లో నమోదైనప ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు నిర్వహించి శుక్రవారం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల్లో మార్కొండపుట్టి, దుగ్గేరు, పనసభద్ర గ్రామాలకు చెందిన ఆరుగురితో పాటు మరో ఇద్దరూ మైనర్లు ఉన్నారు. వారు దొంగిలించిన 10 మేకలు, రవాణాకు ఉపయోగించిన ఆటో, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎనిమిది మందిలో ఆరుగురిని జుడిషియల్ రిమాండ్కు ఇద్దరు మైనర్లను జువైనల్ కోర్టుకు పంపించినట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు.
పామాయిల్ గెలల ట్రాక్టర్ బోల్తా
కొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి భారీగా గోతుల మయం కావడంతో వాహన చోదకులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో అల్ప పీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో శుక్రవారం రామభద్రపురం సమీపంలో పామాయిల్ గెలలతో వెళ్తున్న ట్రాక్టర్ గోతిలో బోల్తా పడింది. ఈ క్రమంల అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
నేడు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ
విజయనగరం: ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహసభ ఈనెల 11న జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కె.రమేష్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం జరగనున్న మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయనున్నామని తెలిపారు. మహాసభకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వెంకటరావు, జి.ఆంజనేయులు, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.గోవిందరాజులు, రాష్ట్ర జిల్లా నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న మహాసభలకు జిల్లాలో, నగరంలో ఉన్న జర్నలిస్టు మిత్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు.బి.ప్రసాదరావు, నాగరాజు పాల్గొన్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
బొబ్బిలి: క్రైస్తవ ప్రార్ధనల అనంతరం చర్చి నుంచి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బొబ్బిలి పట్టణంలోని ఫ్లైఓవర్ వద్ద జరిగిన త ప్రమాదంపై సీఐ కె.నారాయణ రావు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మార్కొండ పుట్టి గ్రామానికి చెందిన నారాయణ పురం లక్ష్మయ్య(53)బొబ్బిలిలోని ఐటీఐ కాలనీలో గల చర్చికి వచ్చాడు. ప్రార్థనల అనంతరం తిరిగి గ్రామానికి వెళ్లేందుకు ఫ్లైఓవర్ వైపు వెళ్తుండగా రామభద్రపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న గుర్తు తెలియని వాహనం లక్ష్మయ్యను ఢీకొని మీదుగానే వెళ్లిపోయింది. వెంటనే స్థానికులు సీహెచ్సీకి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. లక్ష్మయ్య తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్సై లోవరాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


