● పార్వతీపురం మన్యం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి
రామభద్రపురం: చంద్రబాబు ఇచ్చేయమంటే దశాబ్దాల కాలంగా గిరిజన రైతుల సాగులో ఉన్న భూములు స్వాధీనం చేసుకుని పరిశ్రమల పేరిట పెత్తందార్లకు కట్టబెట్టి గిరిజనులకు అన్యాయం చేసేస్తారా? అని పార్వతీపురం మన్యం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎం కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు మండలకేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామభద్రపురం మండలంలోని కాకర్లవలస వద్ద గిరిజన రైతుల పంటలను రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి నిరా్ద్క్షిణ్యంగా ధ్వంసం చేయడం ఘోరమని మండిపడ్డారు. భూమి మీద సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని, ఎంతో కాలం కష్టపడి పండించిన పంటలు పోలీసు ఫోర్స్ ఉపయోగించి దౌర్జన్యంగా ధ్వంసం చేయించిన ఆర్డీవో, తహసీల్దార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పంటలు అధికారులే ధ్వంసం చేయించి అడ్డుకున్న గిరిజన రైతులను అక్రమ అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పెత్తందార్లు ఎలా చెబితే అలా ప్రభుత్వం చేస్తే పేదల ఉసురు తగులుందన్నారు. గిరిజనులు భూములు వదిలేదిలేదని, ధ్వంసం చేసిన పంటలకు సంపూర్ణ నష్టపరిహారం అందించి న్యాయం జరిగే వరకు పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మర్రి శ్రీనివాసరావు, సీపీఎం నాయకుడు బలస శ్రీనివాసరావు, పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు.


