సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఎన్నాళ్లనుంచో ఉన్న మాకే పదవుల్లేవు.. ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది... ఇంకా మా భవిష్యత్తే మాకు అర్థం కావడం లేదు.. ఇక్కడ ఉన్నవాళ్లకి ఏదీ అర్థం కాకపోతుంటే మళ్లా ఆయన, ఆయన కుమార్తె వచ్చి ఏం చేస్తారు..? మళ్లీ ఆయనను తెచ్చి మా మీద రుద్దడం ఎందుకు.. మా నియోజకవర్గాల్లో... గ్రామాల్లో.. మండలాల్లో మా పనులు మేము చేసుకోలేమా? ఆయనొచ్చి ఏం ఉద్ధరిస్తారు.. ఎందుకొచ్చిన లంపటం మాకు.. ఇదీ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని టీడీపీ కార్యకర్త్తల నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు.
గత పదిహేనేళ్లుగా టీడీపీ కార్యకర్త దగ్గర్నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరుకు కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం గవర్నర్గా ఉన్న అశోక్ గజపతిరాజు సైతం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేసినవారే. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఏ రకంగా తమపార్టీలో ఇముడ్చుకోవాలన్నది టీడీపీ క్యాడర్కు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈయనను తెచ్చి ఎందుకు నెత్తిన ఎక్కించుకోవాలన్న ప్రశ్నలు టీడీపీ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నాయి.
మజ్జి శ్రీనివాసరావు చేరికపై
టీడీపీలో పెదవి విరుపు
మా అవకాశాలు కొత్తవాళ్లకు
ఎందుకు అంటూ లోలోన
గుసగుసలు
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల
వ్యతిరేకత
వద్దే వద్దని తేల్చి చెప్పిన
బేబీ నాయిన
కుదురుకోవడం కష్టమేనా?
అదెలా కుదురుతుంది: బేబీ నాయిన
మరోవైపు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయిన కూడా జెడ్పీచైర్మన్ చేరికను వ్యతిరేకించినట్లు తెలిసింది. వాస్తవానికి తాము గతంలో వైఎస్సార్ కాంగ్రెస్లో ఉండేవాళ్లమని, అప్పట్లో బొత్స సత్యనారాయణ, ఆయనతో బాటు మజ్జి శ్రీనివాసరావు తదితరులు కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్లోకి చేరడాన్ని సహించలేకనే తాము టీడీపీలో చేరామని, అలాంటపుడు మళ్లీ ఇప్పుడు ఆయనను టీడీపీలో ఎలా చేర్చుకుంటారని బేబీ నాయిన అధిష్టానాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన టీడీపీలో చేరితే బొబ్బిలి రాజకీయాల్లో వేలుపెట్టి గ్రూపులు కట్టి తమకు ఇబ్బంది పెట్టడం.. పార్టీలో గ్రూపులు కట్టడం వంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయని బేబీనాయిన వాదించినట్లు తెలిసింది. కానీ, టీడీపీ అధిష్టానం ఆయనను ఊరడించి మజ్జి శ్రీనివాసరావును చేర్చుకున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తదితరులు కూడా చిన్న శ్రీను రాకను అయిష్టంగానే స్వాగతించినట్టు బోగట్టా.


