● పార్టీని విజయపథాన నిలుపుదాం
● కార్యకర్తలకు పిలుపునిచ్చిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ
చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రజలకు అండగా నిలబడదామని, వారి సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాటం చేద్దామని, వైఎస్సార్సీపీని విజయపథాన నిలుపుదామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గరివిడిలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనం అండగా నిలబడదామని భరోసా ఇచ్చారు. తన రాజకీయ జీవితంలో కార్యకర్తలు, ప్రజలు అందించిన ఆదరణను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు లభిస్తున్న గౌరవం.. మీరిచ్చిందే అంటూ కంటతడి పెట్టారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు.
బొత్స అడుగుజాడల్లో నడుద్దాం
మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ హయాం నుంచి నేటి వరకు బొత్స హయాంలో జిల్లాతో పాటుగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తుచేశారు. తోటపల్లి సాగునీటిని తీసుకువచ్చిన ఘనత బొత్సకే చెందుతుందన్నారు. వైఎస్సార్ హయాంలో చీపురుపల్లి నియోజకవర్గానికి వంద కోట్లతో ప్రతి గ్రామానికి నీళ్ల ట్యాంకులు నిర్మించి తాగునీరు అందించామని గుర్తుచేశారు. బొత్స అడుగుజాడల్లో నడుద్దామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో పింఛన్లు దరఖాస్తులు స్వీకరిస్తున్నారే తప్ప మంజూరుచేస్తారోలేదో తెలియదన్నారు. అవసరం తీరిపోయాక ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్యగా పేర్కొన్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్కోటాలో అవినీతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, యువ నాయకురాలు బొత్స అనూష, బొత్స సందీప్, పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, పార్టీ చీపురుపల్లి మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, మెరకముడిదాం మండల నాయకులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, పార్టీ మండలాధ్యక్షుడు తాడ్డి వేణు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు, గుర్ల మండల నాయకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జెడ్పీటీసీ సీర అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీ తోట తిరుపతిరావు, నాలుగు మండలాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు.


