● డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: కుష్ఠు వ్యాధిని త్వరగా గుర్తించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. కుష్ఠు వ్యాధిపై ఈనెల 11 నుంచి 24 వతేదీ వరకు ఇంటింటా కుష్ఠు రోగుల గుర్తింపు సర్వే జరగనుంది. ఈ కార్యక్రమంపై గ్రామాల్లో ప్రచారం చేసేందుకు ప్రచార వాహనాన్ని గురువారం జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిదన్నారు. నొప్పి, స్పర్శ లేని మచ్చలు ఉంటే కుష్ఠు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇటువంటి మచ్చల పట్ల నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డాక్టర్ అర్చన దేవి తదితరులు పాల్గొన్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
మక్కువ: మండలంలోని కొండబుచ్చమ్మపేట గ్రామసమీపంలో శ్రీకాకుళం విజిలెన్స్ అధికారులు గురువారం పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. దీనిపై విజిలెన్స్ అధికారులు అందించిన వివరాల ప్రకారం మక్కువ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ ఆటోపై పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు కాపుకాసి పట్టుకున్నారు. మొత్తం 842 కేజీల బియ్యాన్ని తన సొంత మహేంద్ర ఎలక్ట్రికల్ ఆటోలో తరలిస్తుండగా పట్టుబడ్డాయి. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు, వాహనాన్ని పోలీసులకు అప్పగించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
విజయనగరం: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ్ విరాజితుడని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ అన్నారు. విశ్వనాథుని జయంతి పురస్కరించుకుని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు, శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ స్వగృహంలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వేయిపడగల నవలా సృష్టికర్తకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ.. విశ్వనాథుడి కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకని కొనియాడారు. కార్యక్రమంలో గురజాడ వెంకటేశ్వరప్రసాద్, సాహితీవేత్తలు చీకటి దివాకర్, కాగుపాటి నారాయణమూర్తి, ఎం.సుభద్రాదేవి, పసుమర్తి సన్యాసిరావు , గాంధీ తదితరులు పాల్గొన్నారు.
బ్రోచర్ ఆవిష్కరణ
విజయనగరం రూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించమే లక్ష్యంగా నిర్వహించనున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్) – 2026లో భాగంగా అధికారిక బ్రోచర్ను జేఎన్టీయూ ఉప కులపతి వీవీ సుబ్బారావు గురువారం ఆవిష్కరించారు. జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న నిర్వహించనున్న అంతర్గత హ్యాకథాన్లో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. ఈ హ్యాకథాన్కు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా డాక్టర్ జి.జయసుమ వ్యవహరించనుండగా, విద్యార్థి సమన్వయకర్తలుగా ఎం.లిఖిత్కుమార్, కె.ప్రవళ్లిక వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె.చంద్రభూషణరావు, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీఎస్ వకుల, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.


