చికెన్
పార్వతీపురం రూరల్ : అపార క్రీడా నైపుణ్యాలకు మన్యం జిల్లా నెలవని, అయితే సరైన ఆదరణ కరవై ఆణిముత్యాల్లాంటి గిరిజన క్రీడాకారుల ప్రతిభ అడవులకే పరిమితమవుతోందని కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జీవీవీఎస్ కమలాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, వాలీబాల్ తదితర క్రీడల్లో ప్రతిభావంతులైన యువతను గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో కనీసం రన్నింగ్ ట్రాక్, మినీ స్టేడియం లేకపోవడం శోచనీయమన్న ఆయన.. మన్యంలో తక్షణం క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో క్రీడలకు పెద్దపీట వేయగా, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో విద్యావ్యవస్థకే మచ్చతెచ్చేలా నీట్ పేపర్ లీక్ జరిగిందని విమర్శించారు. ఏఐసీసీ ఎలక్టెడ్ మెంబర్ వైరిచర్ల శృతిదేవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యమని, క్రీడల్లో మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం దక్కాలన్నారు. గిరిజన సంస్కృతి, ఆటపాటలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా జిల్లాలో పారాలింపిక్స్ తరహా క్రీడలు నిర్వహించాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం నేతలు స్థానిక వాకర్స్ ప్రతినిధులు, విద్యార్థులతో క్రీడా సదుపాయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గేదెల రామకృష్ణ, బాత దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ డిమాండ్


