కురుపాం: మండలంలో జట్టు సంస్థ ఆధ్వర్యంలో సాగు చేస్తున్న పంటలను ఆఫీస్ ఆఫ్ ఇంటర్నల్ ఓవర్ సైట్ సర్వీసెస్ (ఓఐఓఎస్) చెందిన సభ్యులు కరోలిన్ కురియా, జోసెఫిన్ బుధవారం పరిశీలించారు. ఆగంగూడ, తిత్తిరి, బొడ్డమానుగూడ, దూళికుప్ప గ్రామాల్లో పర్యటించి, జట్టు సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో కొనసాగుతున్న జీవనోపాధి కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా నాటుకోళ్ల ఫారం, ఔషధ మొక్కల సాగు, సేంద్రియ పంటల సాగు విధానంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగ పడతాయని వారు అభిప్రాయపడ్డారు.
12న ఉరుసు ఉత్సవం
విజయనగరం క్రైమ్: స్థానిక కుముందన్ వీధిలో ఈ నెల 12వ తేదీన హజ్రత్ సయ్యద్ బాబా ఉరుసు ఉత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు షేక్ దాదా, షేక్ జాన్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు దర్గా వద్ద విశాఖపట్నానికి చెందిన హఫీజ్ ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుందన్నారు. తొలుత దర్గా నుంచి చందనోత్సవం ఊరేగింపు అట్టహాసంగా జరుగుతుందన్నారు.
కుష్టు వ్యాధిపై అవగాహన
● డీఎంహెచ్ఓ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: ప్రతి గ్రామంలో కుష్టువ్యాధిపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ ఎస్. జీవనరాణి తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కుష్టువ్యాధి కేసుల గుర్తింపుపై పీహెచ్సీ వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుష్టువ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా అంగవైకల్యం భారిన పడకుండా కాపాడవచ్చని తెలిపారు. మేల్ వలంటీర్, ఆశ కార్యకర్తతో కూడిన బృందం ఇంటింటి చేపట్టి, అనుమానితులను గుర్తించి, వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. అంతకుముందు వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నివారణధికారి కె. రాణి, తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించాలి
నెల్లిమర్ల రూరల్: విజయనగరం జెడ్పీ చైర్మన్ పదవిని ఈసారి ఎస్సీలకు కేటాయించాలని జైభీమ్రావ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య కోరారు. ఇదే విషయమై ఆయన మండలంలోని సతివాడ గ్రామంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జిల్లా ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించలేదని, దళితుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికై నా ఎస్సీలకు జెడ్పీ చైర్మన్ సీటు కేటాయించాలన్నారు. ఎస్సీ యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.
ముగిసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
విజయనగరం క్రైమ్: స్థానిక లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక, విజయనగరం కమిటీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్ సీపీ నాయకురాలు కోలగట్ల శ్రావణి హాజరై కాసేపు ప్రసంగించారు. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావం కలిగి ఉండాలని, రోజులో ఎంతో కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. శ్రీకృష్ణుడు బోధనలు అనుసరణీయమని, ఆయన అనుసరించిన మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు. అనంతరం పురవీధుల్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊరేగించారు. రాజీవ్నగర్ కాలనీ, దాసన్నపేట, రింగురోడ్డు, కోట జంక్షన్ మీదుగా సాగిన ఈ ఊరేగింపులో పలువురు చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణల్లో అలరించారు.


