● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత
విజయనగరంలీగల్: విద్య భవిష్యత్కు పునాది అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ బబిత అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మాట్లాడుతూ అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడం మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి తన హక్కులు, బాధ్యతలు, చట్టపరమైన రక్షణ గురించి తెలుసుకోవాలన్నారు. చిన్నారుల భవిష్యత్కు విద్య పునాది అని పాఠశాల విద్యను మధ్యలోనే నిలిపివేయకుండా తల్లిదండ్రులు సహకరించాలన్నారు. డ్రాపౌట్ పిల్లల కుటుంబాలకు విద్య ప్రాముఖ్యత, పిల్లల హక్కులు, బాల కార్మికత్వం, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, ప్రభుత్వ విద్యా పథకాలు, అందుబాటులో ఉన్న న్యాయ సహాయం గురించి వివరించారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత ప్రభుత్వ విభాగాలను, జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి అవసరమైన ఉచిత న్యాయ సహాయం, మార్గదర్శకత్వం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ అధికార సంస్థ సెక్రటరీ డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్, విజయనగరం మండల విద్యాశాఖాధికారి ఆనందమూర్తి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్టుమెంటు హెడ్ నగేష్, విద్యార్థులు పాల్గొన్నారు.


