విజయనగరం ఫోర్ట్:
రేగిడి ఆముదాలవలస మండలానికి చెందిన ఆర్.హరికి, బి. పావనిలకు ఇటీవల వివాహం జరిగింది. వీరు ప్రభుత్వం ప్రకటించిన పెళ్లికానుక పథకానికి దరఖాస్తు చేసుకున్నా, ఇంతవరకు ఎటువంటి సాయం అందలేదు.అలాగే బొండపల్లి మండలానికి చెందిన ఎ.మీనాక్షికి గంట్యాడ మండలానికి చెందిన పి. భాస్కరరావుతో ఇటీవల వివాహం జరిగింది. వీరు కూడా పెళ్లికానుక పథకానికి అర్హులు. అయితే వీరికి కూడా ప్రభుత్వం ఎటువంటి సాయాన్ని అందించలేదు. వీరే కాదు.. జిల్లా వ్యాప్తంగా అనేక మంది నూతన వధూవరులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందని పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎంతోకొంత సాయం అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆడపిల్ల తల్లిదండ్రులు భావించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. రెండున్నరేళ్లుగా ఒక్కరికి కూడా సాయం అందించకుండా కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వస్తే కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు పెళ్లికానుక పేరుతో ఆర్థిక సాయం అందిస్తామని కూటమి సర్కార్ గొప్పగా ప్రకటించుకుంది. దీంతో మహిళలందరూ హామీని నమ్మి వారికి ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లికానుక ఊసే ఎత్తడం మానేసింది. ఆరు నెలల కిందట పెళ్లికానుక స్థానంలో కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది.
కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి సుమారుగా ఆరు నెలలవుతోంది. అయితే ఇప్పటికీ ఆ పథకం గురించి అతీగతీ లేదు. పథకానికి సంబంధించి విధివిధానాలను ఇంతవరకు ప్రకటించలేదు. చంద్రబాబు సర్కార్ ఏ పథకం అమలు చేసినా దాని వెనుక ఒక మెలిక ఉంటుందనే విమర్శలున్నాయి. తాజాగా కల్యాణలక్ష్మి అనే పథకానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఓ మెలిక పెట్టింది. ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల మహిళల ఇంట్లో వివాహానికి రుణం ఇస్తారట. రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇస్తే.. వడ్డీతో సహా తిరిగి తీర్చాలని ప్రభుత్వం మెలిక పెట్టింది.
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా పేదలకు అందని పెళ్లికానుక
కల్యాణలక్ష్మి పేరుతో రూ.లక్ష వరకు రుణం ఇస్తామని ప్రకటన
వేలాది మందికి అందని సాయం
వైఎస్సార్సీపీ హయాంలో కల్యాణమస్తు పేరుతో ఆర్థిక సాయం
2024 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో వేలాది వివాహాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల వరకు వివాహాలు జరిగి ఉంటాయని అంచనా. అయితే ఇందులో ఒక్కరికి కూడా సాయం అందిన దాఖలాలు లేవు. ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తయ్యాయి.. మరో రెండేళ్లు సాగదీస్తే మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి. ఇక మా పరిస్థితేమిటని లబ్ధిదారులు వాపోతున్నారు. పాలకులు స్పందించి కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.


