● కలెక్టర్ రాంసుందర్రెడ్డి
విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువు దాటిన అర్జీలుంటే సహించేది లేదన్నారు. పరిష్కారం కాని వాటికి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. తాగునీరు, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్లో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు మెరుగుపర్చాలని, మున్సిపాలిటీలో గుంతల రోడ్లను వెంటనే పూడ్చాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


