బొబ్బిలి: ఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన భారత పౌరుడుకు రాజ్యాంగం కల్పించిన హక్కుగా గుర్తించాలని ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహనరావు అన్నారు. పట్టణంలోని రాజా కళాశాలలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు పొందేందుకున్న ఫారం ఏ దరఖాస్తు పత్రాలను అందజేసి పూరించే విధానాన్ని తెలియజేశారు. తహసీల్దార్ ఎం.శ్రీను, ప్రిన్సిపాల్ సీహెచ్ వీరేంద్రకుమార్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ బలివాడ గౌరీశంకర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
రీసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి : జేసీ
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియలను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో ఆన్లైన్లో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్ అంశాలు, పాసుపుస్తకాల ప్రక్రియపై సమీక్షించారు. సెప్టెంబరు నెలకు సంబంధించి 29 గ్రామాల్లో 17,888 ఖాతాలకుగాను ఇప్పటివరకు 2,030 ఖాతాలకు మాత్రమే ఈ–కేవైసీ పూర్తయిందని, ఇది 11.35 శాతంగా ఉందని తెలిపారు. అక్టోబరు నెలకు సంబంధించి 80 గ్రామాల్లో వివిధ దశల్లో ఉన్న పాసుపుస్తకాల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ–కేవైసీ, ఫైనల్ ఆర్ఓఆర్, 22ఏ లేయర్, చెక్మెమో, గుడ్ ఫర్ ప్రింటింగ్ దశల్లో పెండింగ్లు లేకుండా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రీసర్వేలో నాలుగు, ఐదు, ఆరో విడతల పనుల పురోగతిని జేసీ సమీక్షించారు. నాలుగో విడతలో వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీవో, జేసీ లాగిన్లలో పెండింగ్లో ఉన్న గ్రామాలను పరిశీలించారు. ఐదో విడతలో వెక్టరైజేషన్, గ్రౌండ్ ట్రూతింగ్, ఈ–కేవైసీ పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఆరో విడతలో గ్రౌండ్ ట్రూతింగ్, నోటీసుల జారీ, పెండింగ్ ఖాతాలపై సమీక్షించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి అర్హులైన వారికి భూ హక్కు ప్రతాలు అందించాలని, ప్రజలకు ఎలాంటి జాప్యం కలగకుండా క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జేసీ స్పష్టం చేశారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ
వసతిగృహాల తనిఖీ
విజయనగరం లీగల్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను ఎక్సైజ్ కోర్టు జడ్జి సీహెచ్ శ్రీవిద్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యటనలో భాగంగా బీసీ కాలనీలోని ప్రీ మెట్రిక్ గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్, రాజీవ్నగర్ కాలనీలోని పోస్ట్మెట్రిక్ గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్, నటరాజ కాలనీలోని పోస్ట్మెట్రిక్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్, వీటీ అగ్రహారంలోని పోస్ట్మెట్రిక్ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యాభ్యాసం, ఆరోగ్య పరిస్థితి, భోజనం మెనూ, తాగునీరు, మౌలిక సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం వంటశాల, భోజనశాల, స్టోర్రూమ్, మరుగుదొడ్లు, స్నానాల గదులు, పడక గదులతో పాటు హాస్టల్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వసతిగృహాల నిర్వహణను మరింత మెరుగుపరచాలని నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.


