● ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు
● ఇద్దరే పిల్లలు
● పెదనడిపల్లి అంగన్వాడీ కేంద్రం తీరు!
పూసపాటిరేగ: మండలంలోని పెదనడిపల్లి గ్రామంలో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు... ఇద్దరు చిన్నారులతో అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది. శనివారం ఉదయం ఒక కార్యకర్త, ఇద్దరు చిన్నారులు మాత్రమే కేంద్రంలో వుంటూ నిర్వహిస్తున్నారు. రెండో అంగన్వాడీ కార్యకర్త ఎటువంటి అనుమతి లేకుండానే కేంద్రానికి రాకుండా గైర్హాజరయ్యారు. అసలు ఇద్దరే పిల్లలు ఉన్న ఈ కేంద్రంలో ఇద్దరు కార్యకర్తలు ఏం చేస్తారన్నది అసలు ప్రశ్న. ఈ తంతును చూసి స్థానికులు విస్తుపోతున్నారు. చాలా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గడంతో కేంద్రాలు నామమాత్రంగానే నడుస్తున్నాయి. కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కొరతగా వుండటం, భవనాలు లేకపోవడం, ఇరుకు అద్దె గదులలో కేంద్రాలు నిర్వహించడంతో కేంద్రానికి చిన్నారులను పంపించడానికి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారనే పరిస్థితులు వున్నాయి. మండల పరిధిలో కొత్తకొప్పెర్ల, పేరాపురం ఎస్సీ కాలనీ కేంద్రాలు అంగన్వాడీ కార్యకర్తలు లేకుండానే నిర్వహిస్తున్నారు. అదనంగా కార్యకర్తలు వున్న చోట ఖాళీగాను కార్యకర్తలు కాలయాపన చేస్తున్నారు. కేంద్రాలను పర్యవేక్షించాల్సిన ఐసీడీఎస్ అధికారులు పర్యవేక్షణ లోపం వలనే కేంద్రాలలో కార్యకర్త పనితీరు మసగబారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించి గాడిలో పెట్టాలని పలువురు చిన్నారులు తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై భోగాపురం ఐసీడీఎస్ సెక్టార్ పీఓ లావణ్య స్పందిస్తూ అనుమతి లేకుండా అంగన్వాడీ కేంద్రానికి గైర్హాజరు అయిన కార్యకర్తపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.


