● కళ్లముందే ఎండిపోతున్న పత్తి మొక్కలు
● లబోదిబోమంటున్న రైతులు
● ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న అన్నదాత..
రామభద్రపురం: ఈ ఏడాది పత్తి సాగు చేస్తున్న రైతులు ఆశలు అడియాసలయ్యాయి. నెలల తరబడి వర్షాల్లేకపోవడంతో కళ్లముందే పత్తి మొక్కలు ఎండిపోతున్నా.. ఏమీ చేయలేని దుస్థితిలో రైతులు తలలు పట్టుకుంటున్నారు. రెండు దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2,204 హెక్టార్లు కాగా.. ఈ ఏడాది 2,291 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. పత్తి సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తుండడంతో సాధారణ సాగు కంటే 87 హెక్టార్లలో సాగు పెరిగింది. ఇందులో ఒక్క రామభద్రపురం మండలంలోనే 1320 హెక్టార్లలో పత్తి సాగవుతోంది. అయితే రెండు నెలలుగా వర్షాల్లేకపోవడంతో పత్తి మొక్కలు ఎండిపోతున్నాయి. మామూలుగా పత్తి పంటలో ఈ పాటికే ఒకసారి పత్తి తీస్తారు. అయితే పంట వేసి 90 రోజులవుతున్నా కిలో దిగుబడి కూడా రాలేదు. నాలుగు అడుగుల మేర పెరగాల్సిన మొక్కలు కనీసం అడుగు ఎత్తు కూడా పెరగలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.


