● రోడ్డు ప్రమాదంలో నవ వరుడి మృతి
● పెళ్లింట తీవ్ర విషాదం
● కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
సంతకవిటి: కోటి కలలతో, బంధుమిత్రుల సందడి మధ్య నూతన జీవితంలోకి అడుగు పెట్టిన వారం రోజుల్లోనే.. వరుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కోసూరు నారాయణరావుకు(పవన్) (20) అదే గ్రామానికి చెందిన హేమలతతో ఆగస్టు 30న వివాహం జరిగింది. తమ బంధువుల ఇంటిలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యేందుకు నారాయణరావు తన స్నేహితుడు అంబటి జగదీష్తో కలిసి ద్విచక్ర వాహనంపై పొందూరు మండలం రాపాక గ్రామం వెళ్లాడు. అక్కడ నుంచి చిలకపాలెంలో ఉన్న తన స్నేహితుడ్ని కలవడానికి వెళ్లి, తిరిగి వస్తుండగా పొందూరు మండలం లోలుగు వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణరావు అక్కడికక్కడే మృతి చెందగా.. జగదీష్కు గాయాలయ్యాయి. దీంతో పెళ్లి ఇంట విషాధ వాతావరణం నెలకొంది. కాళ్ల పారాణి ఆరక ముందే భర్త దూరమవడంతో నవ వధువు, కుటుంబ సభ్యులు కన్నీరమున్నీరుగా విలపిస్తున్నారు.


