● జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు
విజయనగరం రూరల్: బాలల సంరక్షణ, పునరావాసం, సామాజిక పునః సమీకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే జువైనెల్ జస్టిస్ (బాలల సంరక్షణ, రక్షణ) చట్టం – 2015 ప్రధాన ఉద్దేశమని విజయనగరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు అన్నారు. జువైనెల్ జస్టిస్ చట్టం వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హైకోర్టు, జువైనెల్ జస్టిస్ కమిటీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో ‘జువైనెల్ జస్టిస్ చట్టం – 2015: దశాబ్దపు అమలు – ముందడుగు’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సంప్రదింపుల కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ చైర్పర్సన్ హిమబిందు మాట్లాడుతూ.. బాలల పునరావాసం కేవలం సంరక్షణ కేంద్రం నుంచి బయటకు తీసుకురావడంతోనే ముగియదని, కుటుంబం, విద్య, సమాజం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలతో వారిని తిరిగి అనుసంధానించడంతోనే సంపూర్ణ పునరావాసం సాధ్యమవుతుందన్నారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ లీసా గిల్, హైకోర్టు, జువైనెల్ జస్టిస్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ చల్లా గుణరంజన్, ఏపీ జువైనెల్ జస్టిస్ కమిటీ సభ్యులు బి.దేవానంద్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.


