● ఇప్పటివరకు జరగని నూతన
కార్యదర్శుల నియామకం
● ఆలస్యంగా జరుగుతున్న ప్రక్రియతో
నష్టపోతున్న క్రీడాకారులు
విజయనగరం: విద్యార్థి దశ నుంచే బాలబాలికలు క్రీడలపై దృష్టి సారించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్జీఎఫ్(స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రతి ఏడాది ఆగస్టు చివరి వారం/ సెస్టెంబర్ మొదటి వారంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సంబందించిన క్యాలెండర్ను అధికారంగా విడుదల చేసే అధికారులు ఈ ఏడాది సంబంధిత పోటీల నిర్వహణకు జిల్లాస్థాయి కార్యదర్శులను ఇప్పటి వరకు నియమించకపోవడం విశేషం. దీంతో ఈ ఏడాది స్కూల్గేమ్స్ పోటీలు ప్రభుత్వం నిర్వహిస్తుందా..? లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలకు సంబంధించి 2024 వరకు కార్యదర్శి ఒక్కరే ఉండేవారు. రెండేళ్ల పదవీ కాలానికి నిర్వహణ బాధ్యత తీసుకునేవారు. వ్యాయామ ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారి నామినేట్ చేసేవారు. ముందుగా రూపొందించిన ప్రణాళికతో పలు క్రీడల్లో ప్రతి విదా పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభచూపించేందుకు అవకాశముండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలానికి ఒక సీ్త్ర, ఒక పురుష వ్యాయామ ఉపాధ్యాయులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి జిల్లా నుంచి నలుగురు వ్యాయామ ఉపాధ్యాయులు కార్యదర్శుల పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు రాష్ట్రస్థాయి నుంచి పిలుపురాకపోవడం గమనార్హం.
నియామకాల జాప్యంతో తూతూమంత్రంగా
పోటీలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలకు సంబంధించి కార్యదర్శుల నియామక ప్రక్రియలో జాప్యం నెలకొనడంతో పోటీల నిర్వహణకు అవసరమైన సమయం లేక తూతూమంత్రంగా జిల్లా స్థాయి పోటీలు నిర్వహించే పరిస్థితి.
నలుగురు దరఖాస్తు చేసుకున్నారు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శుల ని యామకానికి జిల్లా నుంచి నలుగురు వ్యాయామ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వారి జాబితాను ఉన్నతాధికారులకు పంపించాం. అక్కడి నుంచి పిలుపు వస్తే నలుగురు ఉపాధ్యాయులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. అనంతరం నూతనంగా ఇద్దరు కార్యదర్శుల నియామకం జరుగుతుంది.
– యు.మాణిక్యం నాయుడు, జిల్లా విద్యాశాఖ అధికారి, విజయనగరం


