● నెల్లిమర్లలో ఆవుకు శస్త్రచికిత్స
● ‘గర్భంలో చనిపోయిన దూడను తొలగించి ప్రాణాలు కాపాడిన పశువైద్యులు
నెల్లిమర్ల: పట్టణంలోని సాలివీధికి చెందిన కోలా రామకృష్ణ అనే రైతుకు చెందిన తొలిచూడి ఆవు, ఈనలేక రామతీర్థం జంక్షన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పడిపోయింది. జనసంచార మార్గంలో ఇరుగ్గా ఉండడంతో మూడు రోజుల క్రితమే కడుపులోనే దూడ చనిపోయి, ఉబ్బిపోయింది.స్థానికుల సమాచారంతో యజమాని దానిని ఇంటికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రోడ్డుపై పడిపోవడంతో, వెంటనే భోగాపురం పశు అంబులెన్న్స్ను రప్పించి ఇంటి సమీపానికి చేర్చారు. సతివాడ పశువైద్యుడు డాక్టర్ కె. ప్రవీణ్ కుమార్, రామతీర్థం పశు వైద్యుడు డాక్టర్ డి.సురేష్, అంబులెన్స్ డాక్టర్లు అమృత, లక్ష్మిలతో పాటు నెల్లిమర్ల, భోగాపురం పశువైద్య సిబ్బంది దాదాపు 4 గంటల పాటు శ్రమించి ఆవుకు శస్త్రచికిత్స నిర్వహించారు. గర్భంలో చనిపోయిన దూడను బయటకు తీసి ఆవు ప్రాణాలను కాపాడారు.సకాలంలో స్పందించి వైద్యం అందించడంతో ఆపరేషన్ విజయవంతమై ఆవు క్షేమంగా ఉందని అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి. చక్రవర్తి తెలిపారు. చూలు నిండిన సమయంలో పాడిరైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


